ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరిన్ని దేశాలకు విస్తరించింది. తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ జాడలు శనివారం ఐరోపా దేశాల్లోనూ కనిపించాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ సహా పలు దేశాలు మాస్కులు వంటి నిబంధనలను కట్టుదిట్టం చేయడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో భయాందోళనలకు గురి చేస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలను కోరారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులను ఉద్ధేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ‘కరోనా మహమ్మారి సమయంలో మేం 100 కోట్ల డోస్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్లను వేశాం. ఇప్పుడు 150 కోట్ల డోస్ల వైపు వెళ్తున్నాం.’ అని చెప్పారు. ఈ వేరియంట్ ఆవిర్భావం గురించి వెలువడుతున్న వార్తలు మమ్మల్ని మరింత అప్రమత్తం చేశాయన్నారు. కొవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ దృష్ట్యా మనమందరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం అని అన్నారు. అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సడలింపు ప్రణాళికలను సమీక్షించాలని ఆయన అధికారులను కోరారు.