రాజ్యాంగ నిర్మాతకు సరైన నివాళి అన్న కేసీఆర్
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు ఖరారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దేశానికే గర్వకారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. దిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్కు భారత సామాజిక దార్శనికుడు, మహా మేధావి డా. బీఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్డికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మానవీయ పాలన అందిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూ్తని అమలు చేస్తోంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ తక్కువ కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది’ అని స్పష్టం చేశారు.