హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా నటుడు నవదీప్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నించారు. నవదీప్తోపాటు ఎఫ్ క్లబ్ జి.ఎం. విక్రమ్ నీ అధికారులు విచారణ చేశారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీలపై విచారణ కొనసాగినట్లు తెలిసింది. నవదీప్ బ్యాంకు ఖాతా నుంచి డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ ఖాతాకి నగదు బదిలీ అయిందా, లేదా అని పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే నవదీప్ విచారణకి హాజరయ్యారు. ఇప్పటికే ఈడీ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, నందు, రకుల్ప్రీత్ సింగ్, రాణా, రవితేజ నుంచి వివరాల్ని సేకరించారు.