Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పాక్‌ నుంచి ఉగ్రదాడులు పెరిగే అవకాశాలున్నాయి : భారత్‌

ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌ ఉన్నపుడు జమ్మూ-కశ్మీరు లో ఉగ్రవాద దాడులు తగ్గాయని, ఇప్పుడు ఆ జాబితా నుంచి పాక్‌ను తొలగించడం వల్ల దాడులు పెరిగే అవకాశం ఉందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ఈ అంశాన్ని పరిశీలించాలని కోరింది.ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటివాటిని నిరోధించేందుకు పాకిస్థాన్‌ను 2018లో ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లో పెట్టారు. అయితే పాకిస్థాన్‌ తన యాంటీ మనీలాండరింగ్‌ సెటప్‌ను బలోపేతం చేసిందని, ఉగ్రవాదానికి నిధులను సమకూర్చడాన్ని నిరోధించేందుకు కృషి చేసిందని చెప్తూ ఆ దేశాన్ని ఈ జాబితా నుంచి ఇటీవల తొలగించారు. ఈ జాబితాలో ఉండటం వల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌ల నుంచి ఆర్థిక సాయం పొందడం పాక్‌కు కష్టంగా ఉండేది. ఈ జాబితా నుంచి ఆ దేశాన్ని తొలగించడం వల్ల ఈ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడానికి మార్గం సుగమం అవుతుంది.ముంబైలో జరుగుతున్న ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్‌ టెర్రరిజం కమిటీ సమావేశాల్లో మన దేశానికి చెందిన సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి సఫీ రజ్వీ శుక్రవారం మాట్లాడుతూ, ‘‘ఇబ్బంది పెట్టే దేశాన్ని (పాకిస్థాన్‌ను) ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లో పెట్టడం వల్ల, 2001లో జైషే మహమ్మద్‌ను, 2005లో లష్కరే తొయిబాను ఉగ్రవాద సంస్థలుగా, భారత దేశంపై దృష్టి పెట్టిన తొమ్మిది మంది ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా ఐక్య రాజ్య సమితి ప్రకటించడం వల్ల కశ్మీరులో భారీ భద్రత నడుమ ఉండే ప్రదేశాలు, సంస్థలపై దాడులు తగ్గడం, సరిహద్దుల వెంబడి (పాకిస్థాన్‌ వైపు) ఉగ్రవాద స్థావరాలు తగ్గడం, 2018 నుంచి 2021 మొదటి అర్ధ భాగం వరకు బాహాటంగా ఉగ్రవాద కార్యకలాపాలు, బహిరంగంగా ఉగ్రవాదం కోసం నిధుల సేకరణలను తగ్గడం జరిగింది’’ అని తెలిపారు.
పాకిస్థాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో పెట్టడం వల్ల భారత దేశానికి సాపేక్షంగా శాంతి లభించినట్లు తెలిపారు. గడచిన పదేళ్ళలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమర్థవంతంగా పని చేస్తోందని చెప్పారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై ఐక్య రాజ్య సమితి ప్రకటనలను అమలు చేయడానికి సమర్థవంతమైన సాధనంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ పని చేస్తోందన్నారు. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడం, అధికరణ 370ని రద్దు చేయడం చాలా గొప్ప విషయాలని, ఈ ఘనతలో అత్యధిక భాగం ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టింగ్‌కు, ఐక్యరాజ్య సమితి ప్రకటనలకు ఇవ్వవచ్చునని తెలిపారు. ఇబ్బందులను సృష్టించే దేశం (పాకిస్థాన్‌)లో ఉగ్రవాద మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కారణంగా అధికరణ 370 నిలిచిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img