కరోనా నివారణ చర్యల్లో భాగంగా థర్ట్ డోస్ లేదా బూస్టర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీకాల బూస్టర్ డోసులు ఇచ్చే విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఈ నెలాఖరులోగా ఓ విధానాన్ని ప్రకటించనుంది. ఇతర దేశాల్లో ఏం చేశారన్నదానితో పోల్చుకోకుండా దేశ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని రూపొందించనుంది. దీనిపై ఐఎంఏ ఫంక్షనరీ డాక్టర్ రవి వాంఖేడ్కర్ మాట్లాడుతూ, థర్డ్ డోస్కు తమను అనుమతించాలని వైద్యులు కోరుతున్నారని ఆయన చెప్పారు. థర్డ్ డోస్ కోసం ఒక విధానం తీసుకు వస్తే ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్లు సమర్ధవంతంగా ఇస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని అన్నారు. సరైన విధానమంటూ ఒకటి రూపొందిస్తే ప్రజలకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో థర్డ్ డోస్ ప్రవేశపెట్టడానికి ఇదే మంచి తరుణమని ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ షిండే అభిప్రాయం వ్యక్తం చేశారు.నవంబర్ నెలాఖరు కల్లా దేశవ్యాప్త విధానం ప్రకటించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.