మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ ప్రస్తావించింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని పిటిషన్?లో ప్రభుత్వం ప్రస్తావించింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత ఈ అంశంపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదంది.