*సేవలను సద్వినియోగం చేసుకున్న వాహన డ్రైవర్లు
*భాగస్వామ్యమైన రవాణా శాఖ ఉప కమిషనర్, ఆర్టీవో
విశాలాంధ్ర – విజయనగరం క్రైమ్, జనవరి 20 ః రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్ల సౌకర్యార్థం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. వివిధ ఆసుపత్రుల నుంచి వైద్య నిపుణులు హాజరై డ్రైవర్లకు సేవలందించారు. రక్త నమూనాలు సేకరించి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. కంటి వైద్య నిపుణులు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి పలు జాగ్రత్తలు సూచించారు. ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి షుగర్, బీపీ, నేత్ర సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాకు చెందిన 96 మంది వాహన డ్రైవర్లు, రవాణా శాఖ అధికారులు సిబ్బంది పాల్గొని వైద్య సేవలను పొందారు. డ్రైవర్లలో ఎనిమిది మందికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మెడికల్ క్యాంపు ద్వారా అందించే సేవలను డ్రైవర్లు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్బంగా రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్ డ్రైవర్లకు, వాహనదారులకు సూచించారు. ఇవే టెస్టులకు బయట అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, అది సాధారణ ప్రజలకు భారంగా ఉంటాయని కావున ఇక్కడ అందించే అన్ని రకాల సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, వైద్యుల సలహాల మేరకు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించాలని సూచించారు. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవని అన్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి శాఖ తరఫున సహాయం అందిస్తామని ఈ సందర్బంగా వి. సుందర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో రవాణా శాఖ ఉప కమిషనర్ సుందర్, ఆర్టీవో ఆదినారాయణ, మోటార్ వెహికల్ ఇనస్పెక్ట్రలు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇనస్పెక్ట్ర్లు, వైద్యులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.