పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
ఎస్.కోటలో పర్యటించిన కలెక్టర్ సూర్యకుమారి
విశాలాంధ్ర -ఎస్ కోట : ఎంఎల్సి ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఆమె శనివారం ఎస్కోట మండలంలో పర్యటించారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎంఎల్సి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు తదితర , త్రాగునీరు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్రాగునీరు క్యూలైన్లకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతీ పోలింగ్ బూత్కు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేసి, క్యూలైన్లు నిర్వహించాలని సూచించారు. ఎండ తగలకుండా షామియానా ఏర్పాటు చేయాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లకు, ఓటర్ స్లిప్పుల పంపిణీ, ఓటుకు ఆధార్ సీడింగ్పై బిఎల్ఓలను ఆరా తీశారు. ఈ రోజు సాయంత్రానికి ఓటర్ స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాలలోని 9,10 తరగతులను కలెక్టర్ సందర్శించారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి, వారు పరీక్షలకు సిద్దమవుతున్న తీరును తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన సిలబస్పై ఆరా తీశారు. పరీక్షల్లో అత్యధిక మార్కులను పొందాలని, శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ట్యాబ్లను తనిఖీ చేశారు. ట్యాబ్ ద్వారా వారు ఎన్ని పరీక్షలకు హాజరైనదీ ఆరా తీశారు. ప్రతీ విద్యార్ధీ తప్పనిసరిగా ప్రతిరోజూ పాఠశాలకు ట్యాబ్ను తీసుకురావాలని ఆదేశించారు.
తిమిడి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రోజుకు ఎన్ని ఎకరాల సర్వే చేస్తున్నదీ ఆరా తీశారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తాశిల్దార్ డి.శ్రీనివాస్, రీసర్వే డిప్యుటీ తాశిల్దార్ పి.కీర్తన, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.