స్వయం ఉపాధికి సువర్ణావకాశం
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విశాలాంధ్ర – విజయనగరం : చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ, సాంప్రదాయ హస్తకళల కళాకారులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న తోడు 6 వ విడత నిధులు లబ్ది దారుల ఖాతాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం వర్చువల్ గా నిర్వహంచిన కార్యక్రమం ద్వారా జమ చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లు లేకుండా సులభతరంగా రుణాలు మంజూరు చేస్తున్నామని, , క్రమం తపకుండా తిరిగి చెల్లించి ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలను అదనంగా పొందాలని లబ్ది దారులను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం కాగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, డి.ఆర్.డి.ఎ పి.డి కళ్యాణ చక్రవర్తి, మెప్మ పి.డి సుధాకర రావు, లబ్ది దారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మెగా చెక్కును లబ్ది దారులకు అందజేసారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు 6 వ విడత వడ్డీ రాయితీ క్రింద 29, 279 మంది లబ్ది దారులకు 61.12 లక్షలు రూపాయల లబ్ది చేకూరిందని తెలిపారు. అదే విధంగా ఋణం మంజూరు ద్వారా 7,591 మంది లబ్ది దారులకు 7.59 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని తెలిపారు. ఇప్పటి వరకు 6 విడతలలో 83,758 మంది చిరు వ్యాపారులకు సాంప్రదాయ వృతి దారులకు 10 వేల రూపాయలు చొప్పున 83.75 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా రుణ సహాయం క్రింద 1,20,607 మంది చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో 276.18 లక్షలు వడ్డీ జమ చేయడం జరిగిందన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చెసుకొని ఆర్ధికంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి సాధించడమే కాకుండా మరి కొంత మందికి ఉపాధిని కల్పించడం జరుగుతుందన్నారు. రుణాలు పొందిన వారు జిల్లాలో 90 శాతం వరకు తిరిగి చేలిస్తున్నారని, ఇది శత శాతం కావాలని అన్నారు. క్రమం తప్పకుండ రీ పే చేసే వారికీ సిబిల్ స్కోర్ పెరగడం వలన ఇతర రుణాలు కూడా బ్యాంకుల నుండి పొందగలుగుతారని తెలిపారు.