ఓటు నమోదు, మార్పులకు ఇంకా అవకాశం
జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు
విశాలాంధ్ర – విజయనగరం ; ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి, జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 58,060 మంది ఉన్నారని, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు చెప్పారు. ఎంఎల్సి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకొనేందుకు, పట్టభద్రులకు ఇంకా అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల గడువు ముగియడానికి 10 రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టభద్రులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఓటు చేర్పించుకోడానికి ఫారమ్-18, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు ఫారమ్-7, ఫారమ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంఎల్సి ఓటర్ల జాబితాను ఇటీవలే ప్రచురించిన నేపథ్యంలో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ తన ఛాంబర్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా వివరాలను వెళ్లడించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. మొత్తం నియోజకవర్గంలో 2,83,749 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 58,060 మంది మన జిల్లాలోనే ఉన్నారని వివరించారు. ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఎలక్షన్ సూపరింటిండెంట్ పివి మహేష్, వైఎస్ఆర్సిపి నాయకులు రొంగలి పోతన్న, రెడ్డి, టిడిపి నాయకులు సిహెచ్ కుటుంబరావు, కాంగ్రెస్ నాయకులు ఎస్.సతీష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల వివరాలు ః –
రెవెన్యూ డివిజన్ పురుషులు స్త్రీలు థర్డ్ జెండర్ మొత్తం
బొబ్బిలి 7169 3302 2 10473
చీపురుపల్లి 10296 3904 1 14201
విజయనగరం 20870 12510 6 33386
మొత్తం 38335 19716 9 58060
…………………………………………………………………………………………………….