విశాలాంధ్ర -విజయనగరం : జిల్లా కలెక్టర్ గా ఎస్.నాగలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్గా తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగలక్ష్మికి, జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, ఎన్జీఓలు, వివిధ శాఖల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
సమన్వయంతో ముందుకు వెళ్తాం
ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని సమన్వయంతో పనిచేసి, జిల్లా అభివృద్దికి కృషి చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. తమను నేరుగా కలిసి సమస్యలు ఏవైనా చెప్పుకోవచ్చని సూచించారు. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ది బాటలో నడిపేందుకు ప్రతీఒక్కరూ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.