భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన సభ్యులు
విశాలాంధ్ర – విజయనగరం : విజయనగరం ప్రెస్ క్లబ్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన తాత్కాలిక నూతన కార్యవర్గం ఎంపిక ప్రక్రియ శుక్రవారం జరిగింది. పట్టణ పరిధిలో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, చిన్న మధ్య తరహా పత్రికల విలేకరులు, వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లు, లోకల్ కేబుల్ టీవీ ఛానెళ్ల కేటగిరీల నుంచి 21 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాల మేరకు స్థానిక నెహ్రూ యువ కేంద్ర భవనంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రెస్ క్లబ్ భవిష్యత్తు కార్యాచరణపై సభ్యులందరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రెస్ క్లబ్ కార్యకలపాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, వీలైనంత త్వరగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో ముందకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
మీడియా మిత్రులకు అన్ని విధాలా అండగా ఉంటూ, సంక్షేమ సహాయ సహకారాలు అందించే విషయంలో అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్లాలని తీర్మానించుకున్నారు. ఆరు నెలల పాటు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటైన నూతన కార్యవర్గం అన్ని వర్గాల వారినీ కలుపుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని మూకుమ్మడి ప్రకటన చేశారు. స్నేహ పూర్వక వాతావరణంలో అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లి ప్రెస్ క్లబ్ ద్వారా మీడియా మిత్రులందరికీ అండగా నిలవాలని తీర్మానించుకున్నారు. ఇప్పటి వరకు బాధ్యతగా వ్యవహరించి ప్రెస్ క్లబ్ వ్యవహారాలను సజావుగా నిర్వహించిన అడ్ హాక్ కమిటీ సభ్యులకు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి సభ్యులంతా కరతాల ధ్వనులతో అభినందనలు తెలిపారు.
సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేశ్ తో పాటు ఏపీఆర్వో డి. నారాయణరావు, ఏవీఎస్ సత్యనారాయణ రావు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న మధ్యతరహా పత్రికలు, పీరియాడికల్స్ నుంచి పలువురు జర్నలిస్టులు, కెమెరా మెన్లు, ఫొటో గ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం సభ్యులు వీరే
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంలో సభ్యులుగా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పీఎస్ శివ ప్రసాద్, బూరాడ శ్రీనివాస్, ఎం.ఎం.ఎల్. నాయుడు, వి. వెంకట జగన్నాధం, పెద్ద తరహా పత్రికల నుంచి కె. రమేశ్ నాయుడు, బీజీఆర్ పాత్రో, వీఎం పాత్రో, బి. శ్రీనివాస్, ఎ. సూరిబాబు, కె. శ్రీనివాసులు ఎంపికయ్యారు. చిన్నతరహా పత్రికలు, పీరియాడికల్స్ నుంచి పంచాది అప్పారావు, అవనాపు సత్యనారాయణ, వీఎంకె లక్ష్మణ రావు, ఎం.ఎస్.ఎన్. రాజు, జయరాజు, రవి చంద్రశేఖర్, గొర్లె సూరిబాబు, వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్ల విభాగం నుంచి కరీం, ఈశ్వర్, డి. సత్యనారాయణ, లోకల్ కేబుల్ టీవీ నుంచి కె. శేఖర్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేశ్ పేర్లను ప్రకటించారు.