Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

బీమా పధకాలను సద్వినియోగం చేసుకోవాలి

జూన్ 30 వరకు గ్రామ స్థాయి అవగాహనా సదస్సులు
జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి

విశాలాంధ్ర -విజయనగరం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పధకాలైన పి.ఎం.జీవన్ జ్యోతి బీమా యోజన, పి.ఎం.సురక్ష బీమా యోజన పధకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకునేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా ఈ బీమా పధకాలకు అర్హులేనని, జిల్లాలో ఉన్న హై రిస్క్ ప్రజలంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం బ్యాంకర్లతో కేంద్ర ప్రభుత్వ బీమా పధకాల నమోదు పై ప్రత్యెక సమావేశం నిర్వహించారు. పి ఎం జీవన్ జ్యోతి పధకం క్రింద 18 నుండి 50 సంవత్సరాల వయసు గలిగినవారు సం.నకు 436 రూపాయలను చెల్లిస్తే 2 లక్షల రూపాయలు ఇన్సురెన్సు వస్తుందని తెలిపారు. అదే విధంగా పి ఎం సురక్షా బీమా క్రింద 18 నుండి 70 సంవత్సరాల వయసు వారు 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా క్రింద 2 లక్షలు వరకు చెల్లిస్తారని, ప్రమాదం లో అంగవైకల్యం కలిగిన వారికీ కూడా వర్తిస్తుందని పధకం వివరాలను వెల్లడించారు.
ఈ పధకాలలో నమోదు చేయడానికి ఈ నెల 1 నుండి జూన్ 30 వరకు ప్రతి గ్రామం లో ప్రత్యెక అవగాహనా సదస్సులు నిర్వహించాలని బ్యాంకర్లకు తెలిపారు. లక్ష్యాలతో సంబంధం లేకుండా జిల్లాలో ఉన్న ఉపాధి కూలీలను, ఆటో డ్రైవర్లను, డ్వాక్రా మహిళలను , కల్లు గీత కార్మికులను, భవన కార్మికులను హై రిస్క్ ఉన్న రంగాల్లో పని చేస్తున్న వారందరిని ఈ పధకం క్రింద నమోదు చేయాలనీ సూచించారు. పధకం లో చేరడానికి కావలసిన డాక్యుమెంట్ల వివరాలు, ఫోటోలు, అర్హతలు తదితర అంశాల గురించి ముందు రోజే గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా తెలియజేయాలని , మరుసటి రోజు నమోదు చేసుకోవాలని తెలిపారు. మండల స్థాయి లో ముందుగానే ఒక షెడ్యూల్ తాయారు చేసుకోవాలని , సచివాలయాల్లో, బ్యాంకు లలో ఈ షెడ్యూల్ ను ప్రదర్శించాలని తెలిపారు. మండల స్థాయి లో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి పూర్తిగా అవగాహన కలిగించాలని, తర్వాత గ్రామ స్థాయి లో క్యాంపు లు నిర్వహించాలని తెలిపారు. ప్రతి వారం ఈ నమోదు వివరాల నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాల్లో బ్యాంకర్లే కాకుండా అధికారులు ప్రత్యెక శ్రద్ధ చూపాలన్నారు. దీనితో పాటు బ్యాంకు అధికారులు జగనన్న తోడు, పంట రుణాల మంజూరు, పరిశ్రమలకు ప్రోత్సహించే రుణాల లక్ష్యాల పై కూడా దృష్టి పెట్టాలన్నారు.
ఈ సమావేశం లో ఎల్.డి.ఎం శ్రీనివాస రావు, నాబార్డ్ డి డి నాగార్జున , డి.ఆర్.డి.ఎ పి డి కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ డా. అశోక్ కుమార్, డి.పి.ఓ శ్రీధర్ రాజు, డి.ఎల్.డి.ఓ నిర్మలా కుమారి, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img