లోకాయుక్త నివేదికలను సిద్దం చేయండి
జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు
విశాలాంధ్ర – విజయనగరం కలెక్టరేట్ : పేదలు సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూముల పంపిణీకి సంబంధించి, తాశీల్దార్లు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు కోరారు. భూ పంపిణీకి వచ్చిన ప్రతిపాదనలపై తన ఛాంబర్లో మండలాల వారీగా ఆయన శుక్రవారం సమీక్షించారు. ప్రతీ తాశీల్దార్ తమ మండలానికి ఇచ్చిన లక్ష్యం మేరకు, వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేసి అందజేయాలని ఆదేశించారు. లోకాయుక్త కేసులకు సంబంధించి, వివిధ శాఖల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో, కేసుల గురించి వివరింగా చర్చించారు. లోకాయుక్త కేసులకు సంబంధించి, సమగ్ర వివరాలతో వారం రోజుల్లో నివేదికలను పంపించాలని ఆదేశించారు. ఇలాంటి విషయాల్లో జాప్యం చేస్తే, తరువాత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.