స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం
పూసపాటిరేగ మండలం పోరాంలో పర్యటన
విశాలాంధ్ర పూసపాటిరేగ ః ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాండ్ రీ సర్వే ప్రక్రియ ద్వారా భూములకు శాశ్వత హక్కు లభిస్తుందని, ముఖ్యమంత్రి స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం అన్నారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్తో కలిసి పూసపాటిరేగ మండలం పోరాంలో ఆయన గురువారం పర్యటించారు. పైలట్ ప్రాజెక్టు క్రింద గ్రామంలో చేపట్టిన రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. రీ సర్వే తమకు ఎంతో మేలు చేకూరుస్తోందని రైతులు చెప్పారు. సాదాబైనామా సమస్యలను పరిష్కరించాలని, తమ గ్రామానికి పంట కాలువ వేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో, పోరారం గ్రామంలో జరిగిన రీ సర్వే వివరాలను కలెక్టర్ సూర్యకుమారి వివరించారు.
ఈ సందర్భంగా అజయ్ కళ్లం మాట్లాడుతూ, రీ సర్వే ద్వారా చాలా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. దాదాపు వందేళ్ల తరువాత రీసర్వే జరుగుతోందని, ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని చెప్పారు. ఇన్నాళ్లూ సర్వే జరగకపోవడం వల్ల భూసంబంధిత వివాదాలు ఎక్కువయ్యాయని చెప్పారు. సర్వే చేసి, ఖచ్చితమైన హద్దులను నిర్ణయించడం వల్ల హక్కుదారులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వారికి శాశ్వత హక్కును కట్టబెడుతూ, పట్టాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్డిఓ సూర్యకళ, కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సూర్యనారాయణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి త్రివిక్రమరావు, మండల తాశీల్దార్ భాస్కరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.