హెలికాప్టర్లో నేరుగా చినమేడపల్లికి చేరుకోనున్న సి.ఎం.
విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేసే నిమిత్తం ఆగష్టు 25న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. ముఖ్యమంత్రి జిల్లా సందర్శనకు సంబంధించి షెడ్యూలులో ఎలాంటి మార్పులు లేనప్పటికీ ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి హెలికాప్టర్లో మరడాం సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్తో కలసి చేరుకుంటారు. బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మరడాం హెలిపాడ్కు చేరుకుని విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు. చినమేడపల్లిలో హెలిపాడ్ ఏర్పాటుకోసం నిర్ణయం తీసుకోవడంతో గురువారం ఉదయం నుంచే ముమ్మరంగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం పనులు చేపట్టారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్.నాగలక్ష్మి, ఎస్.పి. దీపిక పాటిల్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ. శేషశైలజలు చినమేడపల్లి వద్దకు ఉదయాన్నే చేరుకొని హెలిపాడ్ నిర్మాణం, శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.