నరసాపురం కెనాల్ కు అందని నీరు…
ఎండి పోతున్న వరి చేలు…
రైతులకు గగ్గోలు…
విశాలాంధ్ర – పెనుమంట్ర: దాళ్వా పై రైతులు పెట్టుకున్న ఆశలు నీటి కొరతతో ఆవిరైపోతున్నాయి. వరి నాట్లు పూర్తికాకుండానే నీటి ఎద్దడి మొదలు కావడంతో డెల్టా రైతులు ఆందోళనకు గుర వుతున్నారు. నాట్లు పూర్తి అయిన చేలు ప్రస్తుతం మూన తిరిగే దశలో ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో నీరు అందకపోతే మొక్క బతికి బట్ట కట్టడం కష్టమని రైతులు వాపోతున్నారు. పెనుమంట్ర మండలంలో ఆయుకట్టుకు నీరందించే నరసాపురం కాల్వకు జనవరి మొదటి వారంలో నీరు విడుదల చేశారు. అయితే అప్పటినుంచి మళ్ళీ నీరు విడుదల చేయకపో వడంతో చేలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు మెల్లమెల్లగా ఎండలు ప్రభావం పెరగడంతో కొన్నిచోట్ల చేలు నెర్రలు తీస్తున్నాయి. నాట్లు పూర్తయిన దశలో వేసిన ఎరువులు నీటి కొరత కారణంగా మొక్కలకు పూర్తిగా అందడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే చేలల్లో నీరు లేకపోవడంతో ఎలుకల విజృంభణ మొదలయ్యిందని చెబుతున్నారు. మండలంలోని మార్టేరు, సత్యవరం, వెలగలేరు, భట్ల మగుటూరు, ఆలమూరు తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇప్పటికే నారుమళ్ళకు, నాట్లకు వేలాది రూపాయలు ఖర్చు చేశామని, తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని తక్షణమే మీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.