ఎఎంసి మాజీచైర్మన్ కాపా శ్రీనివాసరావు
ప్రధాన రహదారిపై టిడిపి వినూత్న నిరసన…
విశాలాంధ్ర/చాట్రాయి: ఎండనకా …వానననక రేయనకా….పగలనకా కాయ కష్టం చేసి పంటలు పండిరచిన రైతుల ఉసురు ప్రభుత్వం పోసుకుంటుందని ఎఎంసి మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చాట్రాయి మండల టిడిపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలపై నిరసనగా ధాన్యాన్ని రోడ్డుపై బోసి టిడిపి వినూత్న నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రైతులకు మద్దతు తెలిపిన కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం పని చేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆ సమస్యలను అధిగమించటమే ప్రభుత్వం పనితీరుకు అడ్డం పడుతుందన్నారు. ధాన్యం కాటాలు వేసిన తర్వాత 15 , 20 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో రాత్రింబవళ్లు రోడ్ల వెంట రైతులు రోడ్ల వెంట పడిగాపులు పడుతున్నారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలన రోమ్ నగరం తగుల పడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చునట్లు వుందన్నారు. తెలుగు రైతు జిల్లా మహిళా కార్యదర్శి మాదాసు చంద్రకళ మాట్లాడుతూ ఇంటి అందం గోడలు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అడ్డం పడుతున్నాయన్నారు. మాజీ ఎంపీపీ కందుల కృష్ణ , టిడిపి మండల అధ్యక్షులు మరిడి చిట్టిబాబు మాట్లాడుతూ ధాన్యం ఎగుమతులకు లారీలు వెంటనే పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి, చాట్రాయి మండల తెలుగు రైతు అధ్యక్షులు చల్లగుళ్ళ రాజారత్నం, మర్లపాలెం ఉప సర్పంచ్ వెల్ది రాజా, సీనియర్ నాయకులు వెల్ది నాగేశ్వరరావు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేసారు.