బుట్టాయిగూడెం: ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజాము నుండి ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షానికి మండలం లోని కొండ వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో మండలంలోని బుట్టాయిగూడెం రహదారిలో ఉన్న కన్నాపురం పడమటి వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు చిన్నం నరసింహారావు తన కుమార్తెతో కలసి కెఆర్ పురం గిరిజన కళాశాలలో హిస్టరీ ఉపాధ్యాయురాలు గా పనిచేస్తున్న తన భార్యను, హ్యుందాయ్ ఐ20 కారులో విధులకు అప్పగించి బుట్టాయిగూడెం తిరుగు ప్రయాణం చేస్తుండగా కారుతో వాగు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన కారు కు ఎదురుగా ట్రాక్టర్ అడ్డు నిలవడంతో వాగు మధ్యలో చిక్కుకున్నాడు. అనుకోకుండా నీటి ఉధృతి పెరగడంతో అది గమనించిన నరసింహారావు కారు దిగి తన కుమార్తెను ఎత్తుకొని ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయట పడ్డారు. అనంతరం స్థానికులు కారుని లాగడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో వాగులో కారు గల్లంతయింది.అదేవిధంగా కొద్ది సేపటికి ఒక వ్యక్తి వాగు దాటడానికి ప్రయత్నిస్తూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా చెట్టు కొమ్మను పట్టుకుని తేలియాడుతున్న ఆ వ్యక్తిని స్థానికులు గమనించి సహాయాన్ని అందించడంతో అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.