ప్రజలను మోసగిస్తున్న ప్రజా ప్రతినిధులు
ఏలూరు:
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని టిడిపి ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం స్థానిక 15వ డివిజన్ పరిధిలోని చిరంజీవి బస్ స్టాప్ నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్ళిన ఆయన వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బడేటి చంటి మాట్లాడుతూ పనికిమాలిన కారణాలు చెప్తూ నగరాభివృద్దిని పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల జ్వరాలతో నగర ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం మెడికల్ క్యాంపు లు నిర్వహించి ప్రజలకు మనోధైర్యం కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని బడేటి చంటి ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశుద్ధ్యం క్షీణించిన ప్రాంతాల్లో కనీసం బ్లీచింగ్ చల్లే ప్రయత్నాలు కూడా అధికారులు చేయటం లేదంటే వై.సి.పి పాలన ఎంత అద్వాన్నంగా ఉందో అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాల్లో వీధిలైట్లు కూడా వెలిగిన పాపాన పోవడం లేదని, కార్పొరేషన్ అధికారులు, పాలకులు మొద్దునిద్ర పోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చెత్త పన్ను వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వ పాలనలో మూడు రోజులకు ఒకసారి చెత్త ఎత్తే పరిస్థితులు దాపురించాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రజల కష్టాలను అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో టి.డి.పి తరపున అందర్ని కలుపుకుని ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని బడేటి చంటి హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి కూన మాణిక్యం, క్లస్టర్ ఇంఛార్జి చోడే వెంకటరత్నం, పార్టీ నాయకులు కంచరపు దేవేంద్ర, కిల్లి వాసు, వంగలపూడి సత్యనారాయణ,పోతురాజు,పిరుపల్లి అమ్మోరు బాబు, ఆడారి సత్తిబాబు, నిడిగట్టి సుధీర్, నిడిగట్టి నాగరాజు, ఆవుల చంద్రం, యేసు, గుంజే దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.