ఏలూరు: సమాజ సేవలో సింధు చారిటబుల్ ట్రస్ట్ అగ్రభాగాన ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ గనివేడ సింధూర తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోగల 19వ వార్డులో, రూరల్ మండలం మోదుగగుంట గ్రామాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలో 30, మోదుగ గుంట గ్రామంలో 17 మంది నుండి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా సింధూర మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా రక్తదానం మిన్న అన్నారు. రక్తదానం చేయడం వలన ఆపదలో, ప్రమాదంలో ఉన్న ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఉభయగోదావరి జిల్లాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, తమ కార్యకలాపాలు ఇతర జిల్లాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సలహాదారు గనివేడ సాయి సుధాకర్, రక్తదాన సేకరణ నిమిత్తం తాళ్లూరి వందన, ఎం శ్రావణ కుమార్, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.