Friday, April 26, 2024
Friday, April 26, 2024

టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందించాలి

కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్

ఏలూరు: టిడ్కో ఇళ్లు ఇళ్లను లబ్ధిదారులకు భేషరతుగా అందించి, కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు బేషరతుగా అందించాలని,
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని,పేదలకు ఇచ్చిన స్థలాలలో ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్,జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలకు సొంత ఇల్లు కావాలని సిపిఐ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. 2018 నాటికి పట్టణ పేద ప్రజలకు అప్పటి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్ళు సుమారు 2.62 లక్షలు నిర్మాణం పూర్తయినా నేటికీ ప్రభుత్వం లబ్దిదారులకు అందించడంలేదని విమర్శించారు..
మున్సిపల్ శాఖకు మంత్రులు మారుతున్నారు, టిడ్కో ఇళ్ళకు రంగులు మారినవి కాని, లబ్దిదారులకు సొంత ఇంటి కల మాత్రం నెరవేరడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ళ లబ్దిదారులకు సొంత ఇంటిని దక్కించడం కోసం సిపిఐ గతంలో లబ్దిదారులను
సమీకరించి గృహ ప్రవేశాలకు ఉద్యమం చేసిన పిమ్మట ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిన విషయం గుర్తుచేశారు. ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏలూరు ఏరియా పరిధిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాలనీ, కొత్తూరు ఇందిరమ్మ కాలనీ,సుందరయ్య కాలనీ, మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ, చాటపర్రు సీబిఎన్ కాలనీ, బీసీ కాలనీ, గీతా కాలనీలతోపాటు అనేక కాలనీలు ఏర్పాటు
చేసి దశాబ్దాలు గడుస్తున్నా రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, త్రాగునీరు వంటి కనీస మౌలిక వసతులు నేటికీ కల్పించలేదన్నారు.
2019లో ఏర్పడిన వైసిపి ప్రభుత్వం పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని
చెప్పి ఊరికి దూరంగా 48 గజాల స్థలం కేటాయిస్తే చిన్నపాటి వర్షానికి ఆ స్థలాలు చెరువుల్లా మారిపోతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, పొటేలు పెంటయ్య, పోలా భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, మావూరి విజయ, తెర్లాపు శ్రీను, భజంత్రీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img