. టీనేజర్ను కాల్చి చంపిన పోలీసు
. ఫ్రాన్స్వ్యాప్తంగా నిరసనలు, హింస
. హంతక పోలీసుపై చర్యలకు, మంత్రి గెరాల్డ్ రాజీనామాకు డిమాండ్
. 660 మంది అరెస్టు – 250 మంది పోలీసులకు గాయాలు
పారిస్: ఫ్రాన్స్ దేశం అట్టుడికిపోతోంది. పోలీసుల కాల్పుల్లో 17ఏళ్ల నాహల్ మరణించడంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. గత మూడు రోజులుగా ప్రధాన నగరాల్లో నిరసనలు హోరెత్తగా, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. నాహెల్ ట్రాఫిక్ చెక్ను అధిగమించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ట్రాఫిక్చెక్ను అధిగమించినంత మాత్రాన కాల్చి చంపేందుకు పోలీసులకు హక్కు ఎవరిచ్చారని నిరసనకారులు నిలదీశారు. హంతక పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అంతర్గత శాఖ మంత్రి గెరాల్డ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫ్రాన్స్లో జాతి వివక్ష ఉందని, బహుళజాతి సమాజాలపై దాడులకు తాజా ఘటన నిదర్శనమని ఆరోపించారు. ఫ్రాన్స్వ్యాప్తంగా అనేక నగరాల్లో వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు. కొన్ని భవనాలను ధ్వంసం చేశారు. లిల్లే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు నిప్పంటించారు. న్యాయం కోసం డిమాండ్ చేశారు. పోలీసులతోనూ వాగ్వాదం, ఘర్షణలకు దిగిన ఫలితంగా వివిధ ఘటనల్లో 250మంది పోలీసులు గాయపడ్డారు. ఇప్పటివరకు 660 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ శుక్రవారం తెలిపారు. 667 మంది అరెస్టు అయినట్లు వెల్లడిరచారు. ఇదిలావుంటే, నాహల్ తల్లి నేతృత్వంలో ‘పోలీస్ కిల్స్’ (పోలీసులు చంపేస్తారు’, ‘కిల్లర్ పోలీస్’ (పోలీసులు హంతకులు) బ్యానర్లతో నిరసన ప్రదర్శన పెద్దఎత్తున జరిగింది. నాహల్కు న్యాయం కోసం డిమాండ్ మిన్నంటింది. ఈ నిరసనకు మద్దతు పెరుగుతోంది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతాన్ని నిరసనకారులు హోరెత్తించారు. మంత్రి గెరాల్డ్ డర్మానిన్ రాజీనామాను డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. శాంతియుతంగా ప్రారంభమైన మార్చ్ మధ్యలో హింసాత్మకంగా మారిందని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రతినిధి కామిల్లె చైజ్ తెలిపారు. వాహనాలు, కంటెయినర్లు, ఫర్నిచర్ను నిరసనకారులు తగులబెట్టినట్లు వెల్లడిరచారు. పోలీసుల చర్యను సమర్థించారు. ఈ మార్చ్లో లా ఫ్రాన్స్ ఇన్సౌమిస్ (ఎల్ఎఫ్ఐ) పార్టీకి చెందిన నేతలతో పాటు ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఫాబియన్ రౌసెల్ పాల్గొన్నట్లు తెలిసింది. మరోవైపు ఈయూ సమావేశం కోసం బ్రసెల్స్లో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఫ్రాన్స్ నిరసనల క్రమంలో పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని దేశానికి తిరిగొచ్చారని, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారని సమాచారం. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని ఆయన ఆక్షేపించినట్లు తెలిసింది.