అమెరికాలోకి అడుగుపెట్టనివ్వనని ప్రకటన
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టు వ్యతిరేకతను చాటుకుంటున్నారు. మతవాదాన్ని పెంచిపోషించేలా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వేళ క్రైస్తవ మతస్తులను తన వైపుకు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు, మార్క్సిస్టులపై విషం కక్కుతున్నారు. అసలు వారిని తమ దేశంలోకి అడుగు పెట్టనివ్వనని హామీలిస్తున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక వాదంతో రిపబ్లికన్లు, డెమొక్రటిక్ పార్టీ మధ్య నకిలీ విభజన రేఖలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తాయి. ట్రంప్ తాజాగా వాషింగ్టన్లో ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ సదస్సులో ప్రసంగిస్తూ ‘అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులను అమెరికాకు దూరంగా ఉంచుతుంది’ అని ఉద్ఘాటించారు. అమెరికాలో ఉండే కమ్యూనిస్టులు, మార్కిస్టుల విషయంలో కొత్త చట్టాన్ని తెస్తామని చెప్పారుగానీ దాని గురించి వివరాలు ఇవ్వలేదు. కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు తమ దేశంలో అడుగు పెట్టేందుకు వీల్లేకుండా ఇమిగ్రేషన్, నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 212 (ఎఫ్)ను వినియోగిస్తానని ట్రంప్ చెప్పారు. ‘కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అందరినీ అమెరికాలోకి రానివ్వం. మన దేశానికి వచ్చే వారు మన దేశాన్ని ప్రేమించాలి’ అని అన్నారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ పురాతన చట్టాన్ని వినియోగించి అమెరికాలోకి కమ్యూనిస్టు, మార్క్సిస్టు ఇమిగ్రెంట్లను నిషేధించడం సాధ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అలాగే కమ్యూనిస్టువాదానికి అమెరికాలో మద్దతు ఉండగా ట్రంప్ ఇటువంటి రాజకీయ సిద్ధాంతాలపై దృష్టి పెట్టడం వెనుక మర్మమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే, అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం పౌరసత్వం లేక గ్రీన్ కార్డు పొందేందుకు కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు అవకాశం ఉండదు. అదే విధంగా కమ్యూనిస్టు అనుబంధీకులకు ప్రవేశాన్ని నిషేధించే ఈ చట్టం 1918 నాటిది కాగా కమ్యూనిజం, అరాచకవాదం నుంచి ముప్పు క్రమంలో అప్పట్లో దీనిని అమల్లోకి తెచ్చారు.