విశాలాంధ్ర,పార్వతీపురం: మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రఉత్సవంగా ప్రకటించిందన్నారు. విశాఖపట్నంజిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతంలో అమాయకులైన గిరిజనులపై బ్రిటీషు అధికారులు సాగిస్తున్న దురాగతాలను, దమనకాండను చూసి చలించి, గిరిజనులలో ధైర్యాన్ని నింపి బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడటానికి దళాన్ని తయారుచేసి, తక్కువ వనరులతో ఎంతో బలమైన బ్రిటీషు సైన్యాన్ని ఎదిరించిన ధీశాలని తెలిపారు. చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తని కొనియాడారు. ఆయన పేరున జిల్లాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్రిటిష్ వారిని గడ గడ లాడించిన అల్లూరి సీతారామరాజు ఉద్యమాన్ని, పోరాట పటిమ గొప్పదన్నారు. అల్లూరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతీఉద్యోగి కష్టపడే తత్వం అలవర్చుకోవాలని కోరారు. ఆయన జీవితాన్ని ఏ ఓ జి. చంద్రశేఖర్ వివరించారు.ఈకార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది బి. నాగరాజు,సునీత, డి. సుష్మా పట్నాయక్,ఆదిలక్ష్మి, విజయ కుమార్, మంగమ్మలు పాల్గొన్నారు.