తెలుగు చలన చిత్రాల్లో ఇదో మైల్ స్టోన్ గా నిలుస్తుంది
ఆదిత్యుని దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
విశాలాంధ్ర – అరసవల్లి ( శ్రీకాకుళం): మెగా అభిమానులకి భోళాశంకర్ చిత్రం ఫుల్ మీల్స్ లా కడుపునింపుతుందని ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ అన్నారు. తెలుగు చలన చిత్రాల్లో ఇదో మైల్ స్టోన్ గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. చిరంజీవి యాక్షన్ ,డ్యాన్స్ లతో ఇరగదీసాన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని మెహర్ రమేష్ కుటుంబ సభ్యులు,రచయిత మామిడాల తిరుపతిలతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. శ్రీకాకుళం విచ్చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్ కి అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెహర్ రమేష్ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ఆలయంలోని అనివెట్టి మండపంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆద్వర్యంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరి సూర్యప్రకాశరావు జ్ఞాపికను అందజేసారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగష్టు 11వ తేదిన విడుదల కాబోతుందన్నారు.ఈ చిత్రం విజయవంతమైన తర్వాత మరో సారి సూర్యభగవానుని దర్శనానికి వచ్చి ఆశీస్సులు పొందుతామన్నారు. శ్రీకాకుళంలో సందర్శనీయస్థలాలు ఎన్నో ఉన్నాయని త్వరలో జిల్లాలో కూడా షూటింగ్ నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. అరసవల్లి దేవస్థానంపై కూడా డాక్యుమెంటరీ తీయమని ఆలయ ప్రధాన అర్చకులు కోరగా తప్పకుండా తీస్తామని ,స్వామి వారి సేవలో భాగస్వామ్యం అయ్యే అకాశం రావడం అదృష్టంగా భావిస్తామని మెహర్ రమేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి,వైశ్యరాజు మోహన్ ,బలభద్రుని రాజా,ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ సతీష్ ,సరస్వతి థియేటర్ మేనేజర్ చిన్న రాజు ,మెగా అభిమానులు గౌతమ్ ,నవీన్ ,కిరణ్ ,చంటి,శీర రాజు తదితరులు పాల్గొన్నారు.