విశాలాంధ్ర -కొయ్యలగూడెం: నియోజకవర్గంలో గ్రూపులు సహించను. కలిసి పని చేయండి. లేదంటే చర్యలు తీసుకోక తప్పదు. పోలవరం నియోజకవర్గం సమీక్షా సమావేశం సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హెచ్చరించి 20 రోజులు గడిచినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నియోజకవర్గ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అయ్యింది. మహాశక్తి పథకం మండలాల్లో ప్రచారం నిర్వహించడం కోసం మండలంలోని బోడిగూడెం గ్రామంలోని టిడిపి పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశక్తి చైతన్య రథం జండా ఊపి ప్రారంభించారు. ప్రజలందరికీ అవగాహన అయ్యేలా పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోరగం శ్రీనివాసులు మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం 18 నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నవారికి నెలకు రూ. 1500 చొప్పున అందిస్తామన్నారు. కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు, దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అనంతరం కొయ్యలగూడెం లోస్థానిక నాయకులతో జరిగిన సమావేశంలో ఐక్యంగా పనిచేసి టిడిపిని విజయం దిశగా తీసుకురావాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, పోలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, పట్టణ అధ్యక్షులు జేష్ట రామకృష్ణ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే మాజీ శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు లేకుండానే మండలంలో 2 చోట్ల కార్యక్రమం నిర్వహించడం పట్ల మొడియం వర్గంలోని సీనియర్ కార్యకర్తలు, నాయకులు అలకబూనారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనలు పాటించకుండా ఏకపక్షంగా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మొడియం అనుచరులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. అధిష్టానం తక్షణం జోక్యం చేసుకుని నష్ట నివారణకు చర్యలు చేపట్టకపోతే మరోసారి పోలవరం నియోజకవర్గంలో భంగపాటు తప్పదని తటస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ విషయంలో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.