విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 52వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వర్ధంతి సందర్భంగా “తెలుగు భాష రక్షణ- మన బాధ్యత” అంశంపై పాఠశాల హెచ్ఎం శైలజ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన భక్త ఏలూరి వెంకన్న మాట్లాడుతూ తెలుగు కవులు వంటి ఘనులు లేరు, తెలుగుతనము వంటి తీయదనం లేదు, చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ తెలుగు భాష ప్రాచీనమైనదని తెలిపారు. ప్రపంచంలో ఆరవ స్థానము, దేశంలో మూడవ స్థానంలో ఉన్న తెలుగు భాష నేడు పాలకుల నిర్లక్ష్యం వలన నిర్లక్ష్యానికి గురి కావడం చాలా బాధాకరమని తెలిపారు. గిడుగు రామ్మూర్తి ఉద్యమ స్ఫూర్తితో భాషను రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, జాషువా జీవితం సాహిత్య కృషి అందరికీ ఆదర్శం కావాలని తెలిపారు. అనంతరం సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ హరి మాట్లాడుతూ భాషా దినోత్సవాలు జరుపుకోవడం ఆరోజు మాత్రమే భాష గొప్పతనం గురించి మాట్లాడుకోవడమే కాదు, అమలుకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. అనంతరం హిందీ పండితులు వేణుగోపాల చారి ఉర్దూ టీచర్ తెలుగు భాష గొప్పతనం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.