టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర – ధర్మవరం : చేనేతల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునే పరిస్థితి లేదు అని,దాడులు చేసే వారు ఏ పార్టీ వారైనా మా స్పందన ఒకేలా ఉంటుంది అని తెలిపారు.చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునే పరిస్థితి లేదని వారు హెచ్చరించారు. గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. ఇన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా పట్టు వ్యాపారస్తులను కలుసుకోలేకపోయానని, అమెరికా నుంచి వచ్చిన తర్వాత బాధితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది అన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ధర్మారం వ్యాపారస్తులకు ఎప్పుడూ టిడిపి అండగా ఉంటుందని తెలిపారు. ధర్మవరంలో చేనేత కార్మికులు మృదుస్వభావులుగా ఉంటారని, వారు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదని తెలిపారు ఇటీవల కరోనా సమయంలో వ్యాపార పరంగా తీవ్రంగా నష్టాలు మోస్తున్నారని, ఇలాంటి సమయంలో చీరలు తీసుకున్న వాటికి డబ్బు ఇవ్వకుండా వేధింపులు చేయడం సరైన చర్య కాదన్నారు. విజయవాడలో ఏకంగా దాడులు చేశారని, ఇది చేనేత వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి సమయంలో ధర్మవరంలో ఉన్న చేనేత కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాడులు చేసిన వారిని ఉపేక్షించకూడదని, వారందరికీ గుణపాఠం చెప్పాలా చేనేతలు కలిసి ఉండాలని సూచించారు. ఇటీవల చేనేత వ్యాపారులకు చాలామంది బకాయిలు ఉన్నట్లు తెలుస్తోందని, వారు భయంతో వారిని నిలదీయలేకపోతున్నారని ఇలాంటి వారికి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలపై ఈ తరహాలో దాడులు పట్ల తీవ్రంగా వ్యవహరించేలా ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామని,ఈ అంశం మీద చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడుతానని పరిటాల శ్రీరామ్ అన్నారు.