విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండల పరిధిలో ఉన్న రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాష్ట్ర గిరిజన గురుకులాల డిప్యూటీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మౌలిక వసతులతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి మెరుగైన బోధన అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతోపాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కేటాయించిన విధంగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా 199 గిరిజన పాఠశాలలు ఉన్నాయని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు.అనంతరం స్టాక్ రిజిస్టర్ రికార్డులను తనిఖీ చేసి సూచనలు,సలహాలు ఇచ్చారు.