జనక మోహన రావు దుంగ
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో డిసెంబర్ 23 వ తేదీన ర్యాగింగ్ జరగడం దారుణమైన విషయం. ఈ ఘటనలో 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఆదిమ మానవుడు నుంచి నాగరిక సమాజంలోకి మనిషి అడుగు పెట్టినా బుర్రలో ఎక్కడో దాగి ఉన్న పైశాచిక బుధ్ధి బయటకు వచ్చి బుసలు కొడుతోంది. ర్యాగింగ్ ఓ పైశాచిక క్రీడ. ర్యాగింగ్ అనేది ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి దానిని చూసి ఆనందపడే ఒక పాశవిక చర్య. కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించడంతో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. వేలాది మంది తెలివైన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతున్నది. జూనియర్లపై వివక్షత అనేది రంగు, జాతి, మతం, కులం, లింగం, ప్రాంతీయత, పుట్టిన ప్రదేశం, నివాస స్థలం, ఆర్థిక నేపథ్యం వంటి అనేక రూపాలలో ఉంటుంది. జూనియర్లు శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అధిక స్థాయిలో ఉంటే ర్యాగింగ్ చేయడానికి భయపడతారు. ఏతా వాతా తెలివితేటలు ఉన్నా కూడా బలహీనులే బలవుతున్నారు. ఒక్కోసారి ఈ వేదనను భరించలేక తగు సమయంలో పరిష్కరించేవారు లేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ ర్యాగింగ్లో లైంగిక వేధింపులు, స్వలింగ సంపర్క దాడులు, బట్టలు విప్పడం, బలవంతంగా అశ్లీల చర్యలు, సంజ్ఞలు, శారీరక హాని లేదా ఆరోగ్యానికి లేదా వ్యక్తికి ఏదైనా ఇతర ప్రమాదం కలిగించే చర్యలు ఉంటాయి.
ర్యాగింగ్ పై కమిటీలు ఏమి చెప్పాయి:
ఏకే గంగూలీ నేతృత్వంలోని ధర్మాసనం ‘‘అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉండరు. కొందరు అత్యంత సున్నిత మనస్కులై చిన్నపాటి విషయాలకే ఉద్రేకానికి గురవుతుంటారు’’ అని పేర్కొంది. 1999లో విశ్వ జాగృతి విషయంలో సుప్రీం కోర్టు ర్యాగింగ్ను ‘‘మాట్లాడినా, రాసిన మాటల ద్వారా, ఇతర విద్యార్థిని ఆటపట్టించడం, అసభ్యంగా ప్రవర్తించడం, క్రమశిక్షణా రాహిత్యం వంటి చర్యల ప్రభావంతో కూడిన ఏదైనా క్రమరహిత ప్రవర్తన. ఒక ఫ్రెషర్ లేదా జూనియర్ విద్యార్థిలో చికాకు, మానసిక హాని, భయాన్ని పెంచే కార్యకలాపాలు, సాధారణ కోర్సులో చేయని చర్య, ఏదైనా చేయమని అడగడం, విద్యార్థి శరీరాకృతి, మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితంచేసే విధంగా అవమానం, ఇబ్బందిని కలిగించే చర్య అని నిర్వచించింది. డెభ్భైవ దశకం చివరిలో ఒక ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాలలో ఇద్దరు ఫ్రెషర్లు మరణించిన తరువాత భారత ప్రభుత్వం దేశంలో ర్యాగింగ్ను నిషేధిస్తూ మొదటిసారి నోటిఫికేషన్ను జారీ చేసింది. ర్యాగింగ్ను అరికట్టేందుకు విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలను జారీచేయాలని విశ్వ జాగృతి మిషన్ దాఖలుచేసిన పిల్పై గౌరవనీయులైన సుప్రీంకోర్టు 1999లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని కోరడంతో న్యూఢల్లీిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేపీఎస్ ఉన్ని ఆధ్వర్యంలో ర్యాగింగ్పై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు యూజీసీ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్ని కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్పై చట్టాలు తీసుకురావాలని సూచించింది. ర్యాగింగ్కు వ్యతిరేకంగా సున్నితత్వంకోసం చేపట్టాల్సిన వివిధ చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. విద్యార్థులను ర్యాగింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ర్యాగింగ్ను అరికట్టడంలో విఫలమైన సంస్థలను అడ్మిషన్లకు దూరంగా ఉంచాలని కూడా సూచించింది. విద్యార్థుల అడ్మిషన్ రద్దు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే శిక్షలు విధించాలని ఈ కమిటీ సూచించింది. తీవ్రతను బట్టి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించవచ్చని తెలిపింది. 2006లో సుప్రీంకోర్టు ర్యాగింగ్ను నిరోధించడానికి మార్గాలు, పద్ధతులను సూచించడానికి సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్ కె రాఘవన్ ఆధ్వర్యంలో మరొక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అనేక కీలక పరిశీలనలు చేసింది. ర్యాగింగ్కు మానసిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక,సాంస్కృతిక సహా అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయని, ఇది ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ర్యాగింగ్ను అరికట్టేందుకు కమిటీ కొన్ని బలమైన సిఫార్సులు చేసింది. క్యాంపస్లలో ర్యాగింగ్ కేసుల పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీి) ఉన్నత విద్యా సంస్థలలో ర్యాగింగ్ ముప్పును అరికట్టడంపై నిబంధనలు 2009 పేరున తీసుకువచ్చింది. దీని ప్రకారం ర్యాగింగ్కి పాల్పడిన వారికి సస్పెన్షన్లు విధించవచ్చని, స్కాలర్షిప్, ఫెలోషిప్లు నిలిపివేయొచ్చు. పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ , పరీక్షల ఫలితాలు నిలుపుదల, హాస్టల్ నుంచి బహిష్కరణ, అడ్మిషన్లు రద్దు వంటివి చేయొచ్చు. ఇంకా ఏదైనా ఇతర సంస్థలో ప్రవేశం నుంచి డిబార్ చేయొచ్చని తెలిపింది. వీటిని ఉన్నత విద్యా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
పరిష్కారాలు :
ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలు ప్రత్యేక బాధ్యత వహించాలి. కళాశాలలో చేరే సమయంలో అండర్ టేకింగ్ తీసుకోవాలి. సీనియర్లు, జూనియర్లు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారికి విడివిడిగా హాస్టల్ వసతి కల్పించాలి. ర్యాగింగ్ ఎంత పెద్ద నేరమో అవగాహన కలిగించాలి. విద్యాలయాలలో ఏర్పాటుచేసిన కౌన్సిలింగ్ కేంద్రాలు, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏవిధమైన ఒత్తిడికి గురికాకుండా చురుకుగా పనిచేసి సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉంచాలి. కొన్ని సినిమాలు, వెబ్ సీరియళ్లను నిషేధించాలి. యువత విచ్చలివిడితనాన్ని విడిచిపెట్టాలి. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు ర్యాగింగ్ ఎంత నేరమో తెలియజేయాలి. దోషులకు కఠిన శిక్షలు వేయాలి. వీరి పేర్లు, వారికి పడ్డ శిక్షలు ప్రతీ కాలేజీ నోటీసు బోర్డులో ఉండేటట్లు చూడాలి. ర్యాగింగ్ గురించి ఉన్నత పాఠశాలస్థాయిలో పాఠాలుగా చేర్చాలి. ర్యాగింగ్ను అరికట్టాల్సిన ప్రాథమిక బాధ్యత విద్యాసంస్థలపైనే ఉంటుంది. వాటిని నియంత్రించడంలో మీడియా, పౌర సమాజం చురుకుగా పాల్గొనవలసిన అవసరం ఉంది.
ఫోన్: 8247045230