ఈ మధ్య వాట్సాప్ల్లో రెండు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. కూతుర్ని అత్త వారి ఇంటికి పంపుతున్నప్పుడు ఆ తండ్రి పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు అవి. ఓ వీడియోలో కారు వెనుక ఆ తండ్రి పరుగులు తీశారు. అవి చూసిన నాకు నా కూతూర్ని తొలిసారిగా స్కూల్ దగ్గర దింపి కన్నీరు కార్చిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఇదే సంఘటనను ఓ రెండున్నర దశాబ్దాల క్రితం కవిత్వీకరించారు ఆనాటి ఓ కొత్త కవి. ఆ పద్యం ఇలా ప్రారంభమవుతుంది.
‘‘ నాకు మెలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి
నాకే వీడ్కోలిస్తున్నప్పుడడు
ఇన్నాళ్లూ..! గుండె గదిలో వొదిగి వొదిగి
కళ్లకేదో మంచు తెర కప్పి
చూస్తూ చూస్తూనే గువ్వలా ఎగిరిపోయినట్టుంది
సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది’’
ఈ పద్యానికి ఆ కవి పెట్టిన పేరు ‘‘వలసపోయిన మందహాసం’’. ఆ కవి ముకుంద రామారావు. ఈ కవిత ఓ సంచలనం. చేరా అనే విమర్శకుడు రాసిన అతి తక్కువ మంచి వ్యాసాల్లో ఇది కూడా ఒకటి. ఆ ఒక్క కవితతో తెలుగు సాహిత్య ప్రపంచంలోకి ఐదు పదుల వయసులో తిరిగి వెళ్లని సైబీరియన్ పక్షిలా వచ్చారు ముకుంద రామారావు. కవి అనండి, రచయిత కానివ్వండి, ఏ కళాకారుడైనా తనని తాను ప్రేమించకుండా, మోహించకుండా, వ్యామించకుండా ఏ సృజనైనా చేయలేరు. తాను సృష్టించిన ప్రతి వాక్యం తనది కాకుండా ఎలా ఉంటుంది. చివరికి ఎవరినో ప్రేమిస్తున్నానుకుంటూ రాసే కవిత్వం కూడా ఆ కవో, కవయిత్రో తనను తాను ప్రేమిస్తున్నట్లుగానే చెప్పుకుంటారేమో. ఈ ఎరుకు ముకుంద రామారావులో చాలా ఉంది. అందుకే ఆయన కవిత్వంలో మనమే కాదు ఆయనా ఉంటారు. ఇది చూడండి…
‘‘ఎవరిని ప్రేమిస్తున్నానో అది నేనే.. నేను ప్రేమిస్తున్నది నన్నే
ఒకే శరీరంలో అవతరించిన రెండు ప్రాణాలు
నువ్వు నన్ను చూస్తే… నువ్వు అతన్ని చూస్తావు
నువ్వు అతన్ని చూస్తే… నన్ను చూస్తావు’’
బహుశా మానవుల పట్ల అవ్యాజమైన ప్రేమ, తీసుకోవడంలోనూ., ఇవ్వడంలోనూ కూడా లేకపోతే ఇంత సున్నితమైన కవిత్వం రాదు.
‘‘నువ్వు వెళ్లిపోయినా నాలోనే ఉన్నావు…
‘‘ఎడబాటులో ఎడబాటు నన్నొదిలింది…
నేను అవ్యక్తాన్ని చూడగలిగాను..’’
ఇదీ మనిషిలోని మనిషితనాన్ని చూడడమంటే. ఇంత మంచి కవిత్వం రాసిన ముకుంద రామారావుని చూసిన వారికి ఓ కవిత్వ సంకలం చక్కని ప్యాంటు, షర్టు తొడుక్కుని మనకు ఎదురైనట్టుగా ఉంటుంది. నాకే కాదు… తెలుగు సాహిత్యంలో చాలా మందికి ముకుంద రామారావు ఇష్ట కవి. పంచభూతాలను కాంచిన వారే అంతా. ఆ పంచభూతాలను కాంచడమే కాదు కవిత్వీకరించారు కూడా. ‘‘అదే నేల, అదే గాలి, అదే నీరు, అదే ఆకాశం, అదే కాంతి’’ పేరుతో వచ్చిన ఈ కవిత్వం మనం రోజువారీ జీవితంలో చూసినవే. కానీ ఈ కవికి కొత్తగా ఎలా కనిపించాయో తెలియాలంటే ఈ కవిత్వం చదవాల్సిందే. తెలుగు సాహిత్య ప్రపంచంలో నిలబడాలంటే నీదంటూ ఓ సంతకం ఉండాలి. త్రిపురనేని శ్రీనివాస్ అంటాడూ…‘‘సంతకం ఎప్పుడు ఒకేలా చేయలేను’’ అని. అవును. ముఖ్యంగా కవులు తమ సంతకాన్ని నిరంతరం మార్చుకోకపోతే నిలబడలేరు. ఫ్యాక్టరీల్లోంచి వస్తున్న నల్లటి మేఘంలా కవిత్వం పుంఖానుపుంఖాలుగా వస్తున్న నేటి కాలంలో నీదైన సంతకం ఉండాలి. అది నిరంతరం మారుతూ ఉండాలి. అలా తనదైన సంతకంతో కవిత్వ ప్రయాణం ప్రారంభించి తన అధ్యయనంతో ఆ సంతకాన్ని మార్చుకుంటూ నిలబడుతున్న అతి తక్కువ మంది తెలుగు కవుల్లో ముకుంద రామారావు ముఖ్యులు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి అనేది మా అమ్మ. బహుశా ముకుందా రామారావు తల్లి కూడా అదే మాట చెప్పి ఉంటారు. అందుకే ఆయన పదవీ విరమణ అనంతరం సూఫి కవిత్వ లోతులు చూడడం ప్రారంభించారు. నచ్చి ఉంటుంది. కొన్ని నచ్చకపోయీ ఉంటాయి. ఇలా నచ్చిన వాటిని అనువదించే పని పెట్టుకున్నారు. అలా అనువదించిన వాటిని పూలమాలగా కూర్చి శతాబ్దాల సూఫీ కవిత్వం అంటూ ఓ సంకలనం తీసుకువచ్చారు. ఈ సంకలనంలో కవిత్వమంతా తెలుగు కవిత్వ ప్రియులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. ఇది చాలు కదా ఏ కవిత్వ పాఠకుడికైనా. ఇలాగే నోబెల్ బహుమతులు వచ్చిన గొప్ప కవుల కవిత్వాన్ని కూడా తెలుగులో తీసుకువచ్చారు. ఇంతకు ముందు కవిత్వం కాదు కాని అలా నోబెల్ పురస్కారాన్ని పొందిన వారి గురించి సదాశివరావు వ్యాసాలు రాసేవారు. అవి బాగున్నా… ఆ కవి గురించిన పరిచయాలు మినహా కవిత్వం గురించి పెద్దగా తెలిసేది కాదు. ఆ పనిని ముకుంద రామారావు చేసి ‘‘ఇదిగో మిమ్మల్నే. వీళ్లకి నోబెల్ పురస్కారం ఊరికే రాలేదు. ఇంత అద్భుతమైన కవిత్వం రాశారు కాబట్టే వచ్చింది’’ అని చెప్పారు. అన్నట్లు ఈ మొహమాటపు, సిగ్గరైన, స్వచ్ఛమైన నవ్వుకి ఆనవాలైన ముకుంద రామారావు గురించి ఇదంతా ఎందుకంటే తెలుగులో ప్రతిష్ఠాతకమైన అభో. విజో పురస్కారం ఇస్తున్నారు కాబట్టి. ఈ ఫౌండేషన్ వారికి ప్రతి ఏటా మంచి మల్లెలు ఎలా దొరుకుతాయో… మాల కట్టేందుకు అని నాకో సందేహం. అవును, వీరిచ్చే పురస్కారాలు పొందిన వారంతా వెన్నెల్లో మల్లెల్లాంటి వారే. అలాంటి వారి మల్లె పందిరే అభో. విజో ఫౌండేషన్.
సీనియర్ జర్నలిస్ట్,
ఫోన్: 9912019929