వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాసా ఓ ప్రైవేటు సంస్థతో కలిసి చంద్రుడిపై పరిశోధన చేపట్టింది. ఇందుకోసం సోమవారం కేప్ కెనరవల్ నుంచి వొల్కన్ రాకెట్ను ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా పెరిగ్రిన్ 1 ల్యాండర్ను పంపింది. 1972లో చివరిసారి అమెరికాకు చెందిన అపోలో మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రయోగించిన పెరిగ్రిన్ 1 ల్యాండర్… ఫిబ్రవరిలో చంద్రుడిపై దిగే అవకాశం ఉంది. ఆ ల్యాండర్లో అనేక శాస్త్రీయ పరికరాలను నాసా పంపించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్ అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 2 గంటలకు వొల్కన్ రాకెట్ను ఫైర్ చేశారు. అయితే పెరిగ్రిన్ 1 ల్యాండర్.. ఫిబ్రవరి 23వ తేదీన చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్పేస్ రోబోటిక్స్ సంస్థ ఆస్ట్రోబోటిక్ .. పెరిగ్రిన్ 1 ల్యాండర్ను నిర్మించింది. అయితే ప్రైవేటు సంస్థకు చెందిన ఓ ల్యాండర్ చంద్రుడిపై దిగడం ఇదే ప్రథమం కానున్నది. భవిష్యత్తులో చేపట్టబోయే మానవ మిషన్లకు చెందిన డేటాను పెరిగ్రిన్ సేకరించనున్నది. చంద్రుడిపై కొత్తగా నామకరణం చేసిన బే ఆఫ్ స్టికీనెస్ ప్రాంతంలో పెరిగ్రిన్ ల్యాండర్ దిగనుంది. ఇందులో నాసాకు చెందిన మొత్తం 5 పేలోడ్స్ ఉన్నాయి. మిగతా దేశాలకు చెందిన మరో 15 పేలోడ్స్ కూడా ఉన్నాయి. చంద్రుడిపై ఉన్న రేడియేషన్ స్థాయిలు, ఉపరితలం, ఉప ఉపరితలం, నీటి స్థాయి, అయస్కాంత శక్తిని ఆ పరికరాలను పసిగట్టనున్నాయి. చంద్రుడిపైకి మనుషులు వెళ్లినప్పుడు తీసు కోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ డేటా ద్వారా తెలుసుకోనున్నారు.