చలసాని వెంకటరామారావు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని జనవరి 22న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించ నున్నారు. సుమారు 2,000 కోట్ల రూపాయలను వెచ్చించి సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని ‘‘శ్రీరామ జన్మభూమితీర్థ క్షేత్ర ట్రస్టు’’ నిర్మించింది. జనవరి 22నే శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రజల దర్శనార్థం ఉంచుతారు. 392 స్తంభాలు, 44 ద్వారాలతో మూడు అంతస్తులతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దేశ విదేశాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి వేల కోట్లు విరాళాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణ ట్రస్ట్ కార్యదర్శి చంపట్రాయ్ ఆలయ ప్రాధాన్యతను వివరిస్త్తూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 కంటే, 1971 యుద్ధంలో పాకిస్థాన్ సైనికులు లక్షమంది భారత సైన్యానికి లొంగిపోయిన రోజు కంటే, 1999లో కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు విజయం సాధించిన రోజు కంటే కూడా రాముని ఆలయం ప్రారంభిస్తున్న జనవరి 22 ప్రాముఖ్యత కలిగినదిగా ప్రకటించారు. అంటే భారత ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సార్వభౌమాధికారాల కంటే కూడా రామమందిరం ప్రారంభోత్సవం గొప్పదని ఆయన భావన. రామమందిరంతో పోల్చుకుంటే మన స్వాతంత్య్రం త్యాగాలతో వచ్చింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల ఆధిపత్యం, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సామూహికంగా దీర్ఘకాలంపాటు పోరాడి సాధించుకున్నది. మహాత్మాగాంధీ, భగత్సింగ్, సుభాస్ చంద్రబోసు వంటి మహానీయులు, వీరులు పోరాడి సాధించినది. అణచివేతకు గురైన ప్రపంచ ప్రజలను చైతన్యపరిచి తట్టి లేపింది భారత జాతీయోద్యమం. అటువంటి ఉద్యమ సూర్తికంటే రామాలయం నిర్మాణం గొప్పదని చెప్పటం చరిత్రను వక్రీకరించటమే. చరిత్రను పరిశీలిస్తే రామాలయ నిర్మాణం అబద్ధాలతో, హింసతో ప్రతీకారంతో, ఉద్రిక్తతలతో, మత వైషమ్యాలతో, ప్రజల మధ్య భావ స్వారూప్యత లేకుండా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న రక్త చరిత్రతో నిర్మితమైనది. జనవరి 22న ప్రారంభించనున్న అయోధ్య రామ మందిరం భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్సంఫ్ు, దాని అనుబంధ హిందూ సంస్థల దురహంకారానికి చిహ్నంగా, రాజకీయ ప్రయోజనాలకు ఒక చిహ్నంగా మాత్రమే నిలుస్తుంది తప్ప దేశ ప్రజల మతపరమైన, ఆధ్యాత్మక విలువలకు, హిందూ సమాజ మనోభావాలకు ప్రతిబింబంగా మాత్రం నిలువదు. భారతీయ ఆధ్యాత్మిక విలువలకు ప్రతినిధిగా భావించే శ్రీరాముని రాజకీయ సంకుచిత ప్రయోజనాలకు వినియోగించటం బీజేపీ వంటి పార్టీలకు మాత్రమే సాధ్యం. దీనిని ప్రజాస్వామిక, సెక్యులర్ భావాలు కలిగినవారు, శాంతి, సామరస్యతలు కాంక్షించే అన్ని మతాలవారు తీవ్రంగా వ్యతిరేకించాలి.
1949లో అయోధ్యలోని బాబ్రీ మసీదులో కొంత మంది దుండగులు అర్థరాత్రి ప్రవేశించి దొంగచాటుగా సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఉంచారు. అప్పుడు విగ్రహాలు పెట్టిన వారిని వదిలివేసి బాబ్రీ మసీదుకు తాళాలు వేసి ముస్లింల నమాజ్ తాళాలను తెరిపించింది. ఆ తర్వాత రామ జన్మ భూమి సమస్యను ముందుకు తెచ్చి వందల ఏళ్లుగా ఉన్న బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలోనే రాముడు జన్మించాడని, అందువల్ల అక్కడ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించాలని భారతీయ జనతాపార్టీ దేశవ్యాపితంగా శిలాన్యాస్ పేరిట కార్యమాన్ని పార్రంభించింది. హిందూ, ముస్లింల మధ్య వైరుద్యాలను బీజేపీ సృష్టించింది. రామ జన్మభూమి సమస్యను ఒక రాజకీయ నినాదంగా తీసుకుని బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాని దేశ వ్యాపితంగా రాముని రథయాత్రను ప్రారంభించారు. ఇది దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రచార రథం ప్రతి దశలోను హింస చోటు చేసుకుంది. ఉత్తరభారతంలో ఇది రక్తపాతాన్ని సృష్టించింది. 1990 మండల్ కమిషన్ సిఫారసుల అమలు నేపథó్యంలో రామ రథయాత్ర ఊపు అందుకుంది. ఈ యాత్ర హింసాగ్ని జ్వాలలకు ఆజ్యం పోసింది. ఫలితంగా 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు బీహార్ రాష్ట్రంలోకి ప్రవేశించిన రథయాత్రను నాటి ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ నిరోధించి ఎల్.కె. అడ్వానీని అరెస్టు చేయటంతో యాత్ర ఆగిపోయింది.
1992 డిసెంబరు 6న బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు కరసేవ పేరుతో దేశవ్యాపితంగా లక్షల మంది వాలంటీర్లను బాబ్రీ మసీదు ఉన్న అయోధ్యకు తరలించారు. అక్కడ బీజేపీ ముఖ్యనాయకులు మురళీ మనోహర్జోషీ, ఎల్.కె.అడ్వానీ, ఉమాభారతి వంటి నాయకులు ప్రజలను రెచ్చగొట్టి 500 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఈ చర్యతో దేశం అట్టుడికి పోయింది. దేశంలోని 12 కోట్ల మంది ముస్లింల మనోభాలు, సెక్యులర్ భావాలు కలిగి మత సామరస్యం ఆకాంక్షించేవారి మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఇంత జరుగుతున్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిష్క్రియా పరంగా చేష్టలుడిగి అచేతనంగా ఉండిపోయాయి. దీనితో దేశవ్యాపితంగా హింస చెలరేగింది. రెండు మతాల మధ్య వైషమ్యం పెరిగింది. ఇదే బీజేపీ ఆశించింది. దీని నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ కల నెరవేరింది. 500 సంవత్సరాలుగా బాబ్రీ మసీదు అదే స్థలంలోఉంది. 1949 వరకు ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. మసీదు ఉన్న స్థలంలో ఎటువంటి దేవాలయాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. దేవాలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్లు సాక్ష్యాధారాలు లభించలేదు. త్రేతాయుగంలో శ్రీరాముడు అక్కడే జన్మించాడు అనటానికి ఎటువంటి రుజువులు లేవు. ఆ కాలంలో ఆ ప్రాంతంలో మానవ నాగరికత పరిఢవిల్లిన ఆధారాలు ఏమీలేవు. 1992 డిసెంబరు 6న మసీదు కూల్చి వేయటం నేరమని సుప్రీంకోర్టు చెప్పింది గాని నేరస్థులకు శిక్షలు లేవు. ఆ స్థలంలో రామ మందిరం నిర్మించుకోవాలని నేరస్థులకే అనుమతి ఇచ్చింది. కూల్చివేతనాటి రక్తపుమరకలు ఇంకా ప్రజల హృదయాల నుంచి తొలగి పోలేదు. రాజు తలస్తే దెబ్బలకు కొదవా? మోదీ స్వయంగా రామమందిరం ప్రారంభానికి సిద్ధమయ్యారు. ఈ సమస్యకు అసలు సూత్రధారి ఎల్.కె. అడ్వానీకి అసలు ప్రారంభానికి ఆహ్వానమే అందలేదు. ఒక దేశ ప్రధాన మంత్రి ఒక మత ఆలయాన్ని ప్రారంభించటం లౌకిక ప్రజాస్వామిక దేశంలో ఎటువంటి సందేశం ప్రజలకు ఇస్తుందో ఆలోచించాలి. అన్యాయం విజయానికి ఇది చిహ్నంగా మిగిలిపోనుంది. జనవరి 22 ఆలయ ప్రారంభం నిజాయితీపై కుటిలత్వం విజయానికి గుర్తుగా మిగిలిపోతుంది. అయోధ్య ఆలయ ప్రాంతం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగించే ప్రదేశం కాదు. ముస్లింల మనోవేదనతో కూడిన ఈ నిర్మాణం చరిత్రలో విద్వేషాలకు సాక్షీభూతంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాముడి అజ్ఞాతవాసాన్ని ముగించి అయోధ్య ప్రవేశం చేయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. హిందువుల మనసు దోచుకునేందుకు శ్రీరాముడు ఒక పావుగా బీజేపీకి ఉపయోగపడ్డాడు.
రామాలయ పారంభానికి ట్రస్టు పెద్దలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖడ్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి నాయకులకు ఆహ్వానాలు అందించారు. సీతారాం ఏచూరి ఈ ఆహ్వానాన్ని న్ద్వింంద్వంగా తిరస్కరించారు. మతం వ్యక్తిగతమని, దానిని రాజకీయ సాధనంగా మార్చవద్దని కోరారు. కానీ కాంగ్రెసు నాయకుడు దిగ్విజయసింగ్ సోనియా దీనిని సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు, ఆమె స్వయంగా గాని, ప్రతినిధి బృందంగాని వెళ్లవచ్చునని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ చెప్పింది వాస్తవమైతే కాంగ్రెస్ మరో ఆత్మహత్యకు సిద్ధమైనట్లు భావించవచ్చును. ఒక పక్కన దేశంలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఉమ్మడి పౌరస్మృతి వంటి అప్రజాస్వామిక చట్టాలను తెస్త్తూ, రాజ్యాంగం చెప్పిన లౌకికవాద వారసత్యానికి తిలోదకాలు ఇస్తున్న బీజేపీ సిద్ధాంతాలకు పరోక్ష్షంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. ఒక పక్కన లక్షల సంఖ్యలో ప్రజలను అయోధ్యకు తరలించే పనిని బీజేపీ భుజాన వేసుకున్నది. రాజకీయ లబ్ది లక్ష్యంతో ‘‘అయోధ్య అక్షింతలు’’ ఊరూరా ఇంటింటికి పంపిణి ప్రారంభించారు. జనవరి 22న మరో దీపావళిగా ఇంటింట దీపకాంతులతో టపాసులు కాల్చాలని ప్రధాని పిలుపు ఇస్తున్నారు. అంటే నరకాసురుని వంటి ముస్లిం సమాజాన్ని జయించి హిందువులు రామాలయం నిర్మించటం విజయచిహ్నంగా ఈ దీపావళి జరపాలని ఆయన భావన. అన్ని దారులు అయోధ్యవైపు ఉండాలని బీజేపీ ఆశిస్తున్నది. రాముడు ఆదర్శ పురుషుడైనా రాజ్యం ఏలేవాడు రాక్షసుడైతే ఒక వర్గం ప్రజల ఆత్మఘోషకు రాముడు గుడిలో ఉండలేడు. అందువల్ల ప్రజలకు కావల్సింది మందిరాలు కాదు – ప్రజల మనసులు గెలుచుకోవటం ముఖ్యం.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
ఫోన్: 9490952093