విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 24 వరకు నిర్వహించిన జాతీయ బాలిక వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక ఐసిడిఎస్ సిడిపిఓ జీ వి రమణి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ వసతిగృహం వద్ద ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, ఎంపీడీవో ఆశాజ్యోతి, ఎంఈఓ పనసల ప్రసాద్, ట్రై కార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, ఎస్ఐ అరుణ్ కిరణ్, ఎంపీటీసీ సభ్యుడు తాంబేలి మోహన్ రావు, వైకాపా మండల కన్వీనర్ పాంగి గుణ బాబు లు విచ్చేశారు ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బాలికలు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యను అభ్యసించాలన్నారు. చెడు సహవాసాలు, అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా లక్ష్యాన్ని చేదించే దిశగా విద్యలో రాణించాలన్నారు. ఆకతాయిల వలలో పడి భవిష్యత్తును పాడు చేసుకోరాదని సూచించారు. కౌమార దశలో కలిగే కోరికల పట్ల కఠినత్వంగా ఉంటూ భవిష్యత్తును బంగారు బాట చేసుకోవాలన్నారు. నేటి బాలికలే రేపటి తరాలకు మార్గదర్శకులు కావాలని సూచించారు. తల్లిగా, చెల్లిగా, అక్కగా భార్యగానే గాక ఓర్పుకు సహనానికి మహిళలు పెట్టింది పేరన్నారు అటువంటి మహిళా లోకం ప్రస్తుతం రాణించని రంగం అంటూ ఏదీ లేదన్నారు. విద్య ద్వారానే అన్ని సాధ్యమని ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. శిల శిల్పం కావాలంటే ఉలి దెబ్బలు తప్పవని, అవి భరించిన నాడే రాయి కూడా భగవంతుని స్థానంలో ఉంటుందని, ఆ విధంగా విద్యార్థి దశలో శ్రమించి చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు ఎస్ఐ అరుణ్ కిరణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండలరావు, వసతి గృహ అధికారిని నూక రత్నం, ఐసిడిఎస్ సూపర్వైజర్లు విజయ్ కుమారి, సత్యవతి, గౌహరున్నీషా, రామలక్ష్మి, అప్పలనరస, గౌరీ, రామలక్ష్మి, వైకాపా నాయకుడు సుందర్, మానవ హక్కుల సభ్యురాలు ప్రసన్న, అంగన్వాడి కార్యకర్తలు రాజేశ్వరి, రాశీ, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయునిలు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థినిలు పాల్గొన్నారు.