రహదారి విస్తరణ పనులతో దెబ్బతింటున్న కాఫీ, మిరియాల తోటలు, ద్విచక్ర వాహనాలు
దుమ్ము కారణంగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఆవేదన చెందుతున్న మన్యప్రాంతవాసులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రహదారి విస్తరణ పేరిట జరుగుతున్న పనులలో టిప్పర్లు దుమ్ము రేపుతున్నాయి. కేడీపేట నుంచి రంపుల, పెదవలస, రింతాడ. చింతపల్లి మీదుగా లోతుగెడ్డ జంక్షన్, రాజు పాకల లంబసింగి మీదుగా శరవేగంగా జరుగుతున్న రహదారి విస్తరణ పనులలో టిప్పర్ల తాకిడి ఎక్కువైంది. రహదారి విస్తరణ కు సంబంధించి జరుగుతున్న ఈ పనుల వలన ఈ గ్రామాల గుండా ప్రయాణిస్తున్న వాహనాల రాకపోకలతో , ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, రహదారికి ఇరువైపులా ఉన్న గృహస్తులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక రహదారికి ఇరువైపులా ఉన్న కాఫీ, మిరియాల తోటలు, ఇతర విలువైన వృక్ష సంపద తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి విస్తరణ పనుల వలన గృహాలు, దుకాణ సముదాయాలు తదితర వాటిని నష్టపోయిన కొంతమందికి నష్టపరిహారం చెల్లించినప్పటికీ ఈ రహదారి విస్తరణ పనుల వలన ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నష్టపోతున్న వారికి ఇటువంటి నష్టపరిహారము చెల్లించకపోగా పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పిక్క రాతిపై ప్రయాణించడం వలన ద్విచక్ర వాహనాలు అనతి కాలంలోనే మూలకు చేరుతున్నాయని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.