క్రీడాకారులకు సూచించిన ఏ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
విశాలాంధ్ర – చింతపల్లి( అల్లూరి సీతారామరాజు జిల్లా):- మండలంలోని మారుమూల పంచాయతీ అయిన బలపం పంచాయతీ గుంజివీధి గ్రామంలో సిఆర్పిఎఫ్ 234 బెటాలియన్ కమాండెంట్ సంజయ్ ద్వివేది, డీఐజీలు సత్యేంద్రనాథ్ మిశ్రా, శివశంకర్ లు సామాజిక పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతపల్లి ఏ ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గుంజివీడు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో యువతకు వాలీబాల్ కిట్లు, నెట్ లు అందచేశారు. అనంతరం రాళ్లగడ్డ క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ సిబ్బందికి క్యాంపు భద్రత విషయంలో సూచనలు చేశారు. మావోయిస్టు కార్యకలాపాల పట్ల అప్రమత్తత గా ఉండాలని, వారి దాడుల నుండి రక్షణ కల్పించుకోవడంలో జాగ్రత్తలు గురించి సిబ్బందికి వివరించారు. క్యాంప్ పరిసరాలలో కలియతిరిగి రక్షణ లోపాలేమైనా ఉన్నాయేమో తనిఖీ చేశారు. అనంతరం అన్నవరం పోలీస్ స్టేషన్ విజిట్ చేసి అక్కడ స్థానిక గ్రామస్తుల మధ్య జరిగిన వాలీబాల్ పోటీలను వీక్షించి అన్నవరం పోలీస్ స్టేషన్ లోని సిఆర్పిఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీస్ సిబ్బందికి రానున్న ఎన్నికలపై, క్యాంప్ రక్షణ పై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే రమేష్, అన్నవరం ఎస్సై వెంకటరమణ సిఆర్పిఎఫ్ ఏపీఎస్పీ సివిల్ పోలీస్ లతోపాటు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.