షాయిస్తా ఖానూమ్ పఠాన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకోవడం ఆనవాయితీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాల గురించి తెలుసుకుందాం. ఆవిర్భావం… అభివృద్ధిని పరిశీలిద్దాం. ప్రస్తుతం పెట్టుబడిదారీ వర్గాలు, బహుళజాతి కంపెనీలు స్వార్థ ప్రయోజనాలతో మహిళా దినోత్సవం ఉద్దేశాన్ని దుర్వినియోగిస్తున్నాయి. చరిత్రను వక్రీకరిస్తున్నాయి. ‘విప్లవం’ అనే పదాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. రోజా లక్సంబర్గ్, క్లారా జెట్కిన్ వంటి మహిళా ఉద్యమకారుల చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతుండటంతో నిజానిజాలు తెలుసుకోవడం అవసరం. మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలన్న నిర్ణయాన్ని కోపెన్హాగన్ మహాసభ (1910)గానీ ఇతర ఏ సంఘంగానీ తీసుకోలేదు. 1917లో రష్యాలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ తేదీ అనుకోకుండా ఖరారైంది. గతంలో ఫిబ్రవరి నెల మహిళా ఉద్యమాల మాసంగా ఉండేది.
తమ హక్కుల కోసం మహిళలు పోరాట చరిత్ర పారిశ్రామిక విప్లవం నాటిది. కార్యాలయాలు, పనిప్రదేశాలు, విశ్వవిద్యాలయాలు వ్యాప్తి చెందడం ద్వారా మహిళల్లోనూ క్రమంగా అవగాహన పెరిగింది. ఫ్రెంచ్ విప్లవం క్రమంలో మహిళలు తొలిసారిగా ఓటు హక్కును డిమాండ్ చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పిలుపునిచ్చారు. అప్పట్లో వెర్సయిల్స్ వరకు మార్చ్ నిర్వహించారు. జౌళి మిల్లుల అభివృద్ధి ద్వారా కార్మిక రంగంలో మహిళలు ముందుకొచ్చారు. స్వతంత్ర యూనియన్లు ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా యూనియన్లు అమెరికా, ఇంగ్లండ్లో ఏర్పాటు అయ్యాయి. పారిశ్రామిక విప్లవం క్రమంలో కొత్త విషయాలు తెలియసాగాయి. దీంతో మహిళలు మరింత స్వతంత్రులు కాగలిగారు. వారు తమ భావాలను మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలిగారు. 1790 దశకంలో మేరీ వోల్స్టోన్క్రాఫ్ట్, అన్నా వీలర్ వంటి వారు 19వ శతాబ్దపు మహిళా పోరాట యోధుల్లో ప్రముఖులుగా నిలిచారు. మహిళలను మేల్కొల్పడంలో వారికి ఉన్న హక్కులపై అవగాహన కల్పించడంలో బానిసత్వ సంకెళ్లను తెంచుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. 18151835 మధ్య కాలంలో మొదటిసారి స్వతంత్ర టీయూ కార్యాచరణ మహిళల కోసం రూపుదిద్దుకున్నది. 15వేల మంది మహిళలు సమ్మెకు దిగారు. ఇది వెస్ట్ రైడిరగ్, ఇంగ్లండ్లో జరిగింది. మహిళల సంస్కరణల సమాజాలు ఉనికిలోకి వచ్చాయి. 18, 19వ శతాబ్దాలలో ఓవెనైట్, కార్లైల్ ప్రాంతాల్లో మహిళా కార్మికులు మరింత క్రియాశీలకులయ్యారు. జైళ్లకు కూడా వెళ్లారు. 1857, మార్చి 8వ తేదీన న్యూయార్క్లో కార్మిక మహిళల తొలి ఉద్యమం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయింది. జౌళి మిల్లుల్లో పనిచేసే వందల మంది మహిళా కార్మికులు ఇందులో పాల్గొన్నారు. కనిష్ఠ వేతనాలు, ఆధిక పనిగంటలు, అమానవీయ పనిపరిస్థితులు, ఓటు హక్కు లేకపోవడానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. 1840
50లో కలకత్తాలోనూ టెక్స్టైల్ రంగంలో పనిచేసే యువతులు కూడా సమ్మె చేశారు. ఇంటికే మహిళలు పరిమితం కాదన్న భావనతో పనిచేసే మహిళల కోసం అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తొలి మహాసభ ఒక తీర్మానం చేసింది.
1886 మే (చికాగో) కార్యక్రమాల కంటే పూర్వం అంటే 183080 మధ్య కాలంలో అమెరికాలో జరిగే కార్మికుల ఉద్యమాల్లో తమ పిల్లలు, కటుంబాలతో కలిసి మహిళలు పాల్గొనేవారు. ప్రదర్శనలు, సమ్మెలు, సమావేశాలు, సభలకు వెళ్లేవారు. ఎర్ర బ్యాండ్లు కట్టుకొని, అరుణ పతాకాలు పట్టుకొని పాల్గొనేవారు. 1884 నుంచి ఎనిమిది గంటల పని కోసం డిమాండ్తో అమెరికాలో జరిగిన పారిశ్రామిక సమ్మెల్లో మహిళలు అగ్రభాగాన నిలిచారు.1886, మేలో ఎనిమిది గంటల పని కోసం అమెరికాలో మొట్టమొదటి దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెలోనూ మహిళలు అగ్రభాగాన నిలిచి పోరాడారు. మే 3, 4 తేదీల్లో చికాగోలో జరిగిన హే మార్కెట్ సభల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మే డే అవతరించింది. 19వ శతాబ్దపు చివరిలో కొత్త ఆవిష్కరణలు జరిగి మరింత ఎక్కువ మంది మహిళలు పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఆ ఆవిష్కరణలే టైప్రైటర్లు, టెలిఫోన్లు. నూతన ఉత్పత్తి, కమ్యూనికేషన్స్ మాధ్యమాల ద్వారా మహిళల హోదా పెరిగింది. టైప్రైటర్లు, టెలిఫోన్ల ద్వారా కార్యాలయాలు ఆధునికీకరణ సంతరించుకున్నాయి. సోషలిస్ట్ ఇంటర్నేషనల్ లేదా సెకెండ్ ఇంటర్నేషనల్ను ఫ్రెడ్రిక్ ఏంగెల్స్ స్థాపించారు. మార్క్సిజాన్ని విస్తరించారు. సాయుధ మహిళా సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. 1895లో ఏంగెల్స్ మరణించారు కానీ మార్స్కిస్టు
సామాజిక ప్రజాస్వామిక నాయకులు కారల్ లైబ్క్నెట్, రోజా లక్సంబర్గ్, క్లారా జెట్కిన్, సిల్వియా పన్ఖుస్ట్, నడ్జేడా క్రుప్స్కాయా, ప్లెఖానోవ్ కౌట్సీ, ప్లాటెన్, లెనిన్ వంటి నేతలను వారసులుగా అందించారు. పని హక్కు, మాతాశిశు సంరక్షణ, జాతీయఅంతర్జాతీయ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాతినిధ్యాన్ని మహాసభ డిమాండ్ చేసింది. నెథర్లాండ్స్, ది హేగ్లో జరిగిన మహిళా సదస్సు ద్వారా యుద్ధానికి వ్యతిరేక ఉద్యమాలకు శంఖం పూరించినట్లు అయ్యింది. రాజకీయ హక్కుల కోసం డిమాండ్ చేస్తూ 1907, ఫిబ్రవరి 28న న్యూయార్క్లో అమెరికన్ మహిళా సోషలిస్టుల అధ్వర్యంలో మొట్టమొదటి ‘మహిళా దినోత్సవం’ జరిగింది. మహిళా దినోత్సవాలను ఇప్పట్లా మార్చిలో కాదు ఫిబ్రవరిలో జరుపుకునేవారు. 1896లో లండన్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నేషనల్లో భాగంగా 30 మంది సోషలిస్టు మహిళా ప్రతినిధులు తమ మొదటి సదస్సు నిర్వహించారు. 1907లో జరిగిన స్టట్గార్ట్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నేషనల్లో మహిళలకు ఓటు హక్కుపై వాడీవేడి చర్చ జరిగింది. జర్మన్ సోషలిస్ట్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన క్లారా జెట్కిన్ ముందుకొచ్చి మాట్లాడగా లెనిన్ మద్దతిచ్చారు. 19, 20వ శతాబ్దాల్లో మహిళలకు ఓటు హక్కు కోసం ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. దీని ఫలితంగానే మహిళలకు ఓటు హక్కు లభించింది. ఇంగ్లాండ్తో పాటు యూరప్, అమెరికాలో దశలవారీగా మహిళలు ఓటు హక్కును సాధించుకోగలిగారు. 1909లో న్యూయార్క్లోని ట్రైయాంగిల్ షర్ట్వెయిస్ట్ కంపెనీలో సమ్మె సైరన్ మోగింది. 20వేల మంది పాల్గొన్నారు. మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సదస్సు 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగింది. క్లారా జెట్కిన్ నాయకత్వంలో అంతర్జాతీయ సోషలిస్టు మహిళా బ్యూరో ఏర్పాటు అయ్యింది. ‘మా లక్ష్యం కేవలం మహిళలకు స్వేచ్ఛ కాదు, స్వతంత్ర మానవాళి’ అని ఆమె అన్నారు. ఫిన్లాండ్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైన ముగ్గురు మహిళా సభ్యులు కూడా జెట్కిన్తో ఏకీభవించారు. 1910, ఆగస్టులో కోపెన్హాగన్లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ మహిళా సదస్సులో 17 దేశాల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు 1909, ఫిబ్రవరి 28న న్యూయార్క్లోని సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా అధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం (ఎన్డబ్ల్యూడీ) జరిగింది. 1913 వరకు ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని ఎన్డబ్ల్యూడీగా మహిళలు జరుపుకున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న జర్మన్ ప్రతినిధులు... ఏటా ప్రత్యేకంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని 1910సదస్సులో ప్రతిపాదించారు. ఇందుకు ఏ తేదీని ఖరారు చేయలేదు. ఆ తర్వాత సంవత్సరం మొదటిసారి ప్రదర్శనలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్మారకోత్సవాలు జరిగాయి. 1911లో డెన్మార్క్లో కోపెన్హాగన్ సదస్సు నిర్ణయంతో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లో మార్చి 19న మొదటిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పాటించారు. 10 లక్షల మందికిపైగా మహిళలు, పురుషులు ఐడబ్ల్యూడీ ర్యాలీల్లో పాల్గొన్నారు. పనిహక్కు, ఓటుహక్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలను డిమాండ్ చేశారు. క్లారా జెట్కిన్ మరెవ్వరూ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించలేదు. 1914, మార్చి 8న మహిళల ఓటు హక్కుకు మద్దతుగా లండన్లోని ట్రఫాల్గర్ స్వ్కేర్ వరకు మార్చ్ జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం (1914) సందర్భంగా శాంతి కోసం ప్రచారాన్ని నిర్వహించారు. రష్యా మహిళలు ఫిబ్రవరి 28న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతర్జాతీయ ఉద్యమంపై మార్చి8పై చర్చలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా మహిళలు, పిల్లల వెతలు వర్ణణాతీతం. యుద్ధంలో రెండు మిలియన్ల (20 లక్షల మంది) రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి నిరసనగా 1917, ఫిబ్రవరి చివరి ఆదివారం రష్యా మహిళల ‘బ్రెడ్Êపీస్’ ఉద్యమం జరిగింది. ఇది సార్వత్రిక తిరుగుబాటుకు దారితీసింది. జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. దీంతో ప్రజాస్వామిక విప్లవం మొదటి దశ ముగిసింది. సోవియట్ల మద్దతుతో ఈ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు ఓటు హక్కు లభించింది. బ్రిటన్ మహిళలకు 1920లో ఓటు హక్కు దక్కింది. రష్యాలో వినియోగంలో ఉన్న జులియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23న మహిళల సమ్మె ప్రారంభమైంది. జార్జియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8న జరిగింది. ఈ విధంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే ఆనవాయితీ మొదలైంది. గిర్ని కామ్గార్ యూనియన్ (జీకేయూ) నాయకులు ఉషాతాయి డాంగే మహిళా ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. ఏఐడబ్ల్యూసీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, సీపీఐ, సీఎస్పీ, కాంగ్రెస్లో మహిళా నాయకులు ఉన్నారు. కార్మిక వర్గ ఉద్యమానికి బాంబే, కలకత్తాలోని టెక్స్టైల్ మహిళా కార్మికులు స్ఫూర్తినిచ్చారు. తొలి నాళ్లలో విమల్ రణదేవ్, కుసుమ్ రణదేవ్ నాయకత్వంలో పరేల్ మహిళా సంఫ్ు (బాంబే), మద్రాసులోని ది గోల్డెన్ రాక్ నాదర్ సంఫ్ు (తల్లుల సంస్థ), బెంగాల్లో 1943లో ఏర్పాటైన మహిళా ఆత్మరక్షణ సమితి (మార్స్) కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. 1945, డిసెంబరు 10న ప్యారిస్లో ఉమెన్స్ ఇంటర్నేషనల్ డెమొక్రటిక్ ఫెడరేషన్ (డబ్ల్యూఐడీఎఫ్) పురుడుపోసుకుంది. భారతీయ ప్రతినిధులుగా విద్యా కరున్గో, ఏలా రీడ్ పాల్గొన్నారు. ఆపై రేణు చక్రవర్తి కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందేశాన్ని భారత్లో వ్యాప్తి చేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) అధ్వర్యంలో అంతర్జాతీయ కార్యకలాపాలు కొత్త శిఖరాలకు చేరాయి. మార్చి 8న కార్యక్రమాలు జరుపుకోవడం సర్వసాధారణమైంది. 1953, జూన్ 5
12 తేదీల్లో కోపెన్హాగన్లో జరిగిన ప్రపంచ సదస్సులో భారత మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. మహిళా అక్షరాస్యతకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ చేసిన కృషిని 1973లో యునెస్కో గుర్తించింది. 20ఏళ్ల కష్టానికిగాను నాడేజ్డా క్రుసస్కయా లిటరసీ అవార్డుతో సన్మానించింది. ఐరాస అక్షరాస్యత ప్రచారోద్యమం క్రమంలో అంతర్జాతీయ మహిళా దశాబ్దం (1975`85)లో రెండు లక్షల మంది మహిళలను ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అక్షరాస్యులుగా మార్చింది. జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాల్లో భారతీయ మహిళలు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ క్రియాశీలపాత్ర పోషిస్తున్నారు. అయితే చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకునే అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై దాడులు కొనసాగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఏకైక రాజ్యాంగం ఇది. దీనిని పరిరక్షించుకోవడం అవశ్యం.
(న్యూయేజ్ సౌజన్యంతో)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా