నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందే విధంగా చూడాలని కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నగరంలోని పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ప్రజా ఫిర్యాదుల నమోదు, రిజిస్టర్ల నిర్వహణ, అందిస్తున్న పౌర సేవలపై ఆరా తీశారు.విధులలో నిర్లక్ష్యంగా ఉన్న కార్యదర్శుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 21, 22 నెంబర్ సచివాలయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయాల ద్వారా మరింత మెరుగైన పౌర సేవలు అందాలని అన్నారు. ముఖ్యంగా ప్రజా ఫిర్యాదులను స్వీకరించి నమోదు చేసి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కార్యదర్శులకు ఆదేశించామన్నారు. సచివాలయాల పరిధిలో అనునిత్యం క్షేత్ర పరిశీలనలు చేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించామన్నారు. ప్రధాన రహదారులు, వీధులలో భవన వ్యర్ధాలు వేసినట్లయితే అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజారోగ్య అధికారులకు తెలపాలన్నారు. ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంకు గొట్టాల పైన తెరలు అమర్చే విధంగా ప్రజలలో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు. తడి చెత్త పొడి చెత్త నిర్వహణపై ప్రజలలో అవగాహన వచ్చిందని అయితే ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఘన వ్యర్థ పదార్థాల వర్గీకరణ ఆవశ్యకతను వివరించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణకు ప్రజల సహకరించాలన్నారు. వీధులలో కుక్కల సంచారం పట్ల కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు. తప్పనిసరిగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ అయ్యేవిధంగా చూడాలన్నారు. అనంతరం ఆచంట గార్డెన్ నిర్వహణ పనితీరును ఆయన పరిశీలించారు. లోపాలను గమనించి అక్కడున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.