కాంగ్రెస్ పెద్దలారా ఆడిన మాట తప్పొద్దు… ఆదివాసీలకు అన్యాయం చెయ్యొద్దు.
అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాష్ట్రంలో కనుమరుగైపోతుందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో తన భుజస్కంధాలపై వేసుకుని బలోపేతం చేసిన వంతల సుబ్బారావును కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు నేడు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని శతక బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేని విషయమని దీనిపై పార్టీ పునరాలోచన చేయాలని ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పాంగి రామకృష్ణ, లీగల్ అడ్వైజర్ సింహాద్రి, యు డబ్ల్యు ఈ సి అరకు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనుబాబు లు అన్నారు. అన్నవరం గ్రామంలో ఆ పార్టీ శ్రేణులతో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయాలను మూటగట్టుకుని తేరుకోలేని స్థితికి చేరుకున్న సందర్భంలో ఆ పార్టీలోని పెద్దపెద్ద నాయకులు సైతం ఇతర పార్టీలకు వెళ్లిపోయినప్పటికీ కష్టకాలంలో పార్టీని వేడకూడదన్న శుభసంకల్పంతో వంతల సుబ్బారావు పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనుకున్న సమయంలో పాడేరు నియోజకవర్గంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి పార్టీని తన భుజస్కందాలపై వేసుకున్న నాయకుడు వంతల సుబ్బారావు అన్నారు. ఆయన చిత్తశుద్ధిని గ్రహించిన పార్టీ అధిష్టానం 2024 సార్వత్రిక ఎన్నికలలో సుబ్బారావే తమ పార్టీ అభ్యర్థి అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, ప్రస్తుత పిసిసి అధ్యక్షురాలైన షర్మిల తో సహా ప్రతి ఒక్కరూ బహిరంగంగా ప్రకటించారన్నారు. నేడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీలో చేరి పైరవీలు చేస్తూ తనకే అభ్యర్థిత్వం ఖరారు అయిందని చెప్పుకోవడం, అదేవిధంగా పార్టీ ప్రకటన చేయడం తాము జీర్ణించుకోలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి టిక్కెట్టు ఖరారు చేయడం మంచిది కాదని, పార్టీని నమ్ముకుని పనిచేసిన వ్యక్తులను విస్మరించరాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆడిన మాట తప్పి ఆదివాసీలకు అన్యాయం చేయవద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జి మాడుగుల మండల కోఆర్డినేటర్ కె లక్ష్మణరావు, మువ్వల భాస్కరరావు, పాంగి అప్పారావు, వంతల కోటి బాబు, అధిక సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.