సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి, వైకాపా ప్రభుత్వాలను ఇంటికి సాగనంపెందుకు ఇండియా కూటమి బలపరచిన అరకు పార్లమెంట్, పాడేరు శాసనసభ అభ్యర్థులను గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ అన్నారు. స్థానిక గిరిజన ఉద్యోగ భవన్ లో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి అరకు పార్లమెంట్ సిపిఎం పార్టీ అభ్యర్థి పి అప్పల నరస, పాడేరు నియోజకవర్గ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థి శతక బుల్లిబాబు, సిపిఐ పార్టీ అల్లూరు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణలతో కలసి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి, వైకాపా ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేస్తూ మన్య ప్రాంతంలో సహజ సిద్ధంగా నిక్షిప్తమై ఉన్న వనరులను దోచుకుపోయేందుకు రహ “దారులు” నిర్మిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే రహదారులను నిర్మించడం లేదని, అదే క్రమంలో మన్య ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రాష్ట్రాలలోని బిజెపి, వైకాపా ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించడం బిజెపి యొక్క దురహంకారానికి నిదర్శనం అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలను ఇంటికి సాగనంపితే గాని, సామాన్య ప్రజానీకానికి మనుగడ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఎర్ర బమ్మల ఎంపీటీసీ సభ్యుడు సేగ్గే సత్తిబాబు, ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ అన్ని మండలాల కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లకే వెంకటరమణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాగిన కృష్ణ పడాల్, సిపిఎం పార్టీకి చెందిన ధనుంజయ్, సాగిన చిరంజీవి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు