తెదేపా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి మణికుమారి. ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని తెదేపా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి మత్స్యరాస మణికుమారి అన్నారు. తెదేపా ఉమ్మడి విశాఖ జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బేరా సత్యనారాయణ అధ్యక్షతన బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికలలో తెదేపా అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడన్నారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మన్యప్రాంత గ్రామాల్లో భవిష్యత్తు మనుగడ ఉండాలంటే అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెదేపా హయాంలో తాను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అహర్నిశలు రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేయడం జరిగిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించామన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నారని 15 మంది పిల్లలు ఉన్న ప్రతి గ్రామంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వాటిని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. సామాజిక ఆరోగ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గిరిజన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ విద్యను సమకూర్చాలనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వాటిని తొలగించడం గిరిజనులపై వైకాపాకు ఉన్న సవతి ప్రేమను తేటతెల్లం చేస్తుందన్నారు. గడచిన నాలుగున్నర ఏళ్లలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతోపాటు2024 లో తెదేపా అధికారంలోకి వస్తే బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్య దొర, పార్టీ సీనియర్ నాయకులు ముర్ల సత్యనారాయణ, చల్లంగి సురేష్, బూత్ కన్వీనర్ ముర్ల రాంబాబు, తాజంగిలో శ్యాంసుందర్, మూర్తి, లంబసింగిలో లక్ష్మణ్, పడాల్, పార్వతమ్మ, జనసేన నాయకులు బేరా ఈశ్వరరావు, పరంజ్యోతి, టీఎన్ఎస్ఎఫ్ వినోద్, నాలుగు పంచాయతీలకు చెందిన గ్రామాల పెద్దలు, యువతి, యువకులు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.