సామూహికంగా రాజీనామాలు సమర్పించిన వాలంటీర్లు.
వాలంటీర్ల సంఘం మండలాధ్యక్షుడు పరమేశ్వర రావు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాబోవు సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేసేందుకు మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు సమర్పిస్తున్నామని వాలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు వేములపూడి పరమేశ్వర రావు అన్నారు. వివిధ పంచాయతీల నుండి అధిక సంఖ్యలో స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న వాలంటీర్లు పరమేశ్వర రావు ఆధ్వర్యంలో ఆయా పంచాయతీల కార్యదర్శులకు, తద్వారా ఎంపీడీవో వీర సాయిబాబా కు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా పరమేశ్వర రావు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన వైకాపా అధినేత ముఖ్యమంత్రి
వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకుని వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఉద్దేశంతో పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర రాజును ఎమ్మెల్యే గా, అరకు ఎంపీగా తనూజా రాణిని గెలిపించి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతి ఇవ్వాలనే లక్ష్యంతో సుమారు 190 మందికి పైగా వాలంటరీలు నేడు సామూహికంగా రాజీనామాలు సమర్పించడం జరిగిందని, గడచిన ఐదేళ్లపాటు వాలంటీర్లుగా ప్రజలకు చేసిన నిస్వార్ధమైన సేవతో సంతృప్తిగా ఉన్నామన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి తమ సేవలను ప్రజలకు అందించకుండా ప్రతిపక్షాలు కుట్ర చేశాయని, ఈ విషయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, తమను వాలంటీర్లుగా గుర్తించిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఎంచుకొని తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేయడం జరిగిందన్నారు. గడచిన ఐదేళ్లు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ఏ విధంగా శ్రమించామో ఆ విధంగా శ్రమించి పాడేరు ఎమ్మెల్యే అరకు ఎంపీ స్థానాలలో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీలకు చెందిన వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.