– అవును వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు…!!!
– ఆలస్యంగా వెలుగు చూస్తున్న రా(చ)జకీయ పార్టీల అక్రమ బాగోతాలు …
– నవ్విపోదురు గాక మాకేంటి సిగ్గు….
– చోడవరాన్ని దోచేస్తున్న నాయకులు …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.01.02.2024ది. అనకాపల్లి జిల్లా శాసనసభ నియోజక వర్గమైన చోడవరంలో అధికార వై.సి.పి. ఎమ్మెల్యే, ప్రతిపక్ష టి.డి.పి. మాజీ ఎమ్మెల్యే, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇతర టిడిపి వర్గీయులు ఏకమై మూకుమ్మడిగా భారీ భూ కబ్జాలు, ఇతర దందాలు, చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ ప్రభుత్వ అధికారులను, ప్రజలను తీవ్ర భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని రైతు, మహిళా, ప్రజా, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలో చోడవరం తో పాటు పలు ప్రాంతాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులను బుజ్జగించి, … భయపెట్టి సాగునీటి చెరువులు, కాలువలు ప్రభుత్వ భూములను యదేచ్చగా కబ్జా చేస్తూ భారీ రియల్ ఎస్టేట్, పలు చీకటి వ్యాపారాలు సాగిస్తున్నారు అనేది జ(న)గమెరిగిన బహిరంగ రహస్యం. వీరికి తోడు జన సైన్యం అండతో మరో రాజు చోడవరం ఏలేందుకు సిద్ధమవుతున్నాడు. చోడవరం రెవెన్యూ సర్వే నెంబరు 82 లో, నర్సీపట్నం – చోడవరం బి.ఎన్.ప్రధాన రహదారిని ఆనుకొని వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగి, పట్టణంలోని వాన నీరు, వాడుక నీరును తనలో ఇముడ్చుకుంటూ, వందల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న పాత చెరువును లీజు పేరుతో “గలీజు” చేస్తూ భూ దురాక్రమణలకు పాల్పడుతున్నారని ప్రజలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వారిలో అధికార పార్టీకి చెందిన వారే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లు నాయుడుల షేర్ వాటాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా పట్టణంతో బాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగిన, సాగుతున్న భూ ఖబ్జా ల్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులునట్లు స్థానికంగా విమర్శలున్నాయి. “నవ్వి పోదురు గాక మాకేంటి సిగ్గు” అన్నట్లు ప్రవర్తిస్తున్న చోడవరం శాసన సభ రా(చ)జకీయం వివిధ వర్గాల ప్రజలను, ప్రభుత్వ శాఖల అధికారులను తీవ్ర భయా0దోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రెడ్డిపల్లి అప్పల రాజు ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కొన్ని అనుబంధ ప్రజా సంఘాలు పాత చెరువు భూ కబ్జాల పట్ల ఆందోళనలు చేస్తున్నాయి. పాత చెరువు భూ కబ్జాలు అరికట్టడంలో రెవెన్యూ, పంచాయతీ, ఎండోమెంట్స్ అధికారులు నీరు గార్చుతూ ఖబ్జా రాయుళ్లకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కలసి సంయుక్తంగా ఇప్పటికే చోడవరం ప్రాంతంలో అత్యంత సాగు, త్రాగునీటి వనరులైన బానయ్య కోనేరు, ఎర్రకోనేరు, తామర చెరువు, పాలగెడ్డ తదితర చెరువులు, రస్తా గోర్జి, అంకుపాలెం, లక్ష్మిపురం, చీడికాడ రోడ్డు, ఖండేపల్లి రస్తా రహదారులు, ప్రభుత్వ భూములను యదేచ్చగా కబ్జాలు చేసి అమ్మేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నిరంతరం బహిరంగ బాహా బాహీలకు దిగుతున్న ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు …. ఎవరు అందలమెక్కినా ఇతరులకు సహకరించాలనే రాజకీయ, వ్యాపార అంతర్గత ఒప్పందంతో విచ్చలవిడి దందాలు సాగిస్తూ చోడవరం పట్టణం అభివృద్ధి చెందకుండా మట్టు పెడుతూ, ప్రజలను రాజకీయ పార్టీల అధిష్టానాన్ని మభ్యపెడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అధికార వై.సి.పి., ప్రతిపక్ష రాజకీయ పార్టీ తెలుగుదేశం నాయకులు ఏకమై సంయుక్తంగా పాల్పడుతున్న భూ కబ్జాలు, చీకటి వ్యాపారాలు పై ఈ.డి., సి.బి. సి.ఐ.డి., జిల్లా ఉన్నత స్థాయి అధికారులు చే తక్షణమే బహిరంగ న్యాయ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ.,రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు, అనుబంధ ప్రజా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.