వాస్తవాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుంది
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు అందించడమే రాష్ట్రంలోని వాలంటీర్లు యొక్క ముఖ్యమైన విధి అని, అది మరిచిపోయి వాస్తవాలు తెలుసుకోకుండా, వాలంటీర్లపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ఓ వీడియోని విడుదల చేస్తూ అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఆ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లుగా విధులు కొనసాగిస్తున్న వారు కి ప్రతి 50 ఇళ్లకు ఒకరిని బాధ్యతగా అప్పగించడం జరిగిందన్నారు. ఈ 50 ఇళ్లల్లో కుటుంబాల యొక్క సమస్యలను మాత్రమే తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించే దిశలో అధికారులకు దృష్టికి తీసుకొని వెళ్లి తమ విధులను కొనసాగిస్తున్నారని తెలిపారు. నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ను అసభ్యకరంగా మాట్లాడడం, వ్యవస్థను కించపరచడం లాంటివి సరియైన పద్ధతి కాదని వారి హితవు పలికారు. 18 వేల మంది మహిళలు మిస్ అవుతున్నారన్న అసత్య ప్రచారం తగదని, అలా జరిగి ఉంటే రాష్ట్రము దేశము ఎప్పుడో హై అలర్ట్ అయ్యేదని తెలిపారు. ప్రతిదానికి వైసీపీ పార్టీ పెద్దల హస్తముంది అనడం అనేది అవాస్తవమని తెలిపారు. నేడు రాజకీయాల యొక్క మాటలు చీప్ గా మారడం జరిగిందని, ఏదిబడితే అది మాట్లాడడం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రజల వద్ద మంచి గుర్తింపు రాదని హితవు పలికారు. బరితెగించి మాట్లాడటం.. పవన్ కళ్యాణ్ ఇకనైనా మానుకోవాలని తెలిపారు. ఎవరైనా సరే మహిళలు గూర్చి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుందని తెలిపారు. ఈ సచివాలయంలో వాలంటీర్లు 50 శాతము మహిళలే ఉన్నారని, వీరు కేవలం గౌరవ వేతనముతోనే ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తెలుపుతూ పరిష్కార దిశగా తమ పనులు కొనసాగిస్తున్నారని మరోసారి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ పథకాలపై కుటుంబములోని వారందరికీ అవగాహన కల్పించి, అర్హులు అయితే వారిని లబ్ధిదారులుగా గుర్తించడం లాంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడకుండా వాలంటీర్ వ్యవస్థలపై ఏదైనా అనుమానాలు ఉంటే మీ జన సైనికుల ద్వారా తెలుసుకొని, అవి వాస్తవమైతే మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.