విశాలాంధ్ర-రాప్తాడు : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఇంటింటా ఓటు సర్వే తనిఖీలో రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ లు విధిగా ఉండేలా బిఎల్ఓలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్, ఏఈఆర్ఓ లక్ష్మీనరసింహ ఆదేశించారు. ఓటరు సర్వేకు సంబంధించి రామనేపల్లి, హంపాపురం, బీఎల్ఓలకు గురువారం తగు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళి నిబంధనలకు లోబడి మాత్రమే ఇంటింటా వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. ఓకే ఇంటిలో ఓటర్ లిస్టులో పదిపైన ఉన్న ఓటర్లు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వారికి కొత్తగా డోర్ నెంబర్ (నోషనల్ డోర్ నెంబర్) వేసి నమోదు చేయాలన్నారు. ఓటర్ లిస్టులో డోర్ నెంబర్ లేనిపక్షంలో వాటిని గుర్తించి డోర్ నెంబర్ నమోదు చేయాలన్నారు. ఓటర్ లిస్టులో దివ్యాంగులను గుర్తించాలన్నారు. ఓటరు జాబితాలో మరణించినవారు, శాశ్వతంగా గ్రామంలో లేనివారు, వివాహమై మరొక గ్రామానికి వెళ్లిన మహిళలను గుర్తించి ఫారం-7 నమోదు చేయాలన్నారు. ఇంటింటా సర్వేను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్దేశించిన కాల వ్యవధిలోపు పూర్తయ్యేలా సహకరించాలని బూత్ లెవెల్ ఏజెంట్లను కోరారు.