వైద్యాధికారి ఆనంద వర్ధన్
విశాలాంధ్ర, ఎన్ పీ కుంట: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం లో భాగంగా గురువారం మండల మండల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ప్రైవేటు పాఠశాలలలో ఏడాది వయసు నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలచే మింగించారు. నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల లో వైద్యాధికారి ఆనంద వర్ధన్, ఎంపీడీఓ ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగుల ద్వారా సంక్రమించే రక్తహీనత ను అధిగమించడానికి ఏడాదికి రెండు మార్లు ఆల్బెండజోల్ మాత్రలు మింగించడం జరుగుతుందన్నారు. పిల్లలు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అదేవిధంగా పిల్లలు బయటకు వెళ్లే సమయంలో చెప్పులు ధరించి వెళ్లాలన్నారు. బహిరంగ మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలన్నారు. మండల వ్యాప్తంగా 4628 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశామని వైద్యాధికారి ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో సి హెచ్ ఓ నాగలక్ష్మి, పీహెచ్ఎన్ శాంతమ్మ, ఆరోగ్య విస్తరణాధికారులు లక్ష్మీనారాయణ, రాఘవేంద్ర, ఆరోగ్య కార్యకర్తలు శంకరమ్మ, కేజీబీవీ ఉపాధి సిబ్బంది, ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.