జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ పేరిటతో రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్న వివరాలను, ప్రజలకు పూర్తి దశలో తెలియజేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలైన అనంతపురం,పుట్టపర్తి లలో ముఖ్యమంత్రి ఇచ్చిన జగనన్న కాలనీలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఇన్చార్జులు శనివారం పర్యటించాలని వారు తెలిపారు. ఎన్నో అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని తెలిపారు. శనివారం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు ఈ జగనన్న కాలనీ సందర్శించి, వాస్తవాలను వీడియోలు తీసి, కొన్ని ఫోటోలను తాము తెలిపిన వాట్సాప్ లకు పంపాలని తెలిపారు. వాగులు వంకలు, కొండ ప్రాంతాలలో పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగిందని, అలాంటి చోట పేద ప్రజలు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారని? అలాంటి ఘటనలను కూడా తెలుసుకొని వివరాలను పంపాలని తెలిపారు. మరికొన్నిచోట్ల రోడ్లు కూడా వేయకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజల యొక్క కష్టాలు ప్రభుత్వానికి తెలియటం లేదని దుయ్యబట్టారు. జగనన్న కాలనీలో జరుగుతున్న వట్టింటి మోసాలను ప్రజలకు పూర్తిగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని, ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలని తెలిపారు.