జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం గ్రూప్-2 పరీక్షకు సన్నాహక ఏర్పాట్లు, రెవెన్యూ, రీసర్వే మూడవ దశ, ఇనామ్ & అసైన్డ్ భూములు, హౌస్ సైట్స్ నమోదు, హౌసింగ్- గృహ నిర్మాణం, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎ – కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, ప్రాధాన్యత భవనాలు, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పుష్కలంగా పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వందరోజులపాటు లక్ష్యానికి అనుగుణంగా కుటుంబాలకు పనులు కల్పించడంపై దృష్టి సారించామని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి 100 రోజుల పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మరింత ఎక్కువ మంది కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో ఉరవకొండ, వజ్రకరూరు, కనేకల్లు, బెలుగుప్ప, తదితర మండలాల పరిధిలో తక్కువమంది కూలీలకు పనులు కల్పించడం జరిగిందని, ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఏ పిడి నరసింహారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహషాన్ బాషా, డిఐఓ యుగంధర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి రూప్లనాయక్, ఏపిఎస్పిడిసిఎల్ ఎస్ఈ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.