మెడికోలను అభినందించిన ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ మెడికల్ కళాశాల అనంతపురం 2కె 23 బ్యాచ్ కు చెందిన ద్వితీయ సంవత్సరం వైద్య విద్యార్థులు జానకి దివ్య తేజ్,దివ్య శేకావత్ లు ఈ నెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని మీరా పూర్, రివారి లో గల ఇందిరా గాంధీ యూనివర్సిటీ లో భారతదేశ యువజన సర్వీసుల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత శిబిరం ( నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్) కు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ఎంపికైనట్లు రిజిస్టార్ ఆచార్య డాక్టర్ వేమిరెడ్డి రాధిక రెడ్డి ఉత్తర్వులు పంపించారని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు తెలిపారు. ఈ క్యాంపుకు యూనివర్సిటీ నుంచి కేవలం ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేయగా అందులో ఇద్దరు మెడికల్ కళాశాల అనంతపురం వైద్య విద్యార్థులు కావడం మా కళాశాల గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువత చెప్పే సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆచార వ్యవహారాలు, రకరకాల పోటీలు ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా విద్యార్థులలో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలిపే వీలు ఉంటుందని, ఆ పోటీలలో మంచి ప్రతిభను ప్రదర్శించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు తెలిపారు. వైద్య విద్యార్థులు చదువుతోపాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సామాజిక వికాసం, సామాజిక బాధ్యత, దేశం అభివృద్ధి పట్ల అంకితభావం, జాతీయ సామరస్యం అలవాడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు పాల్గొన్నారు.